
హైదరాబాద్: పంజాబీ రెజ్లర్ నవ్జోత్ కౌర్ మళ్లీ పసిడి పట్టసి చరిత్ర సృష్టించింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా రికార్డు సాధించింది. శుక్రవారం 65 కిలోల విభాగంలో అసాధారణ ప్రదర్శన చేసిన నవ్జోత్ పసిడి గెలుచుకోగా.. రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
నవ్జోత్ కౌర్.. భారత రెజ్లింగ్లో పెద్ద టోర్నీల్లో ఒక్కసారి కూడా మెరవలేదు. 2013 ఆసియా ఛాంపియన్షిప్లో రజతం నెగ్గిన ఈ పంజాబీ రెజ్లర్.. 2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచింది. ప్రతిభ ఉన్నా మెగా టోర్నీల్లో విఫలమవుతోన్న 28 ఏళ్ల నవ్జోత్ ఎట్టకేలకు పసిడి ఆశలు నెరవేర్చుకుంది. కిర్గిజ్స్థాన్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది.
శుక్రవారం మహిళల 65 కిలోల విభాగంలో తిరుగులేని ప్రదర్శన చేసిన నవ్జోత్ ఫైనల్ను ఏకపక్షంగా మార్చేసింది. తుది పోరులో 9-1తో మియా ఇమాయ్ (జపాన్)ను చిత్తు చేసింది. ఆరంభంలో ప్రత్యర్థి దూకుడు ప్రదర్శించిన వెంటనే ఆమెపై పట్టు సాధించిన నవ్జోత్ ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఐతే స్టార్ రెజ్లర్ సాక్షికి మాత్రం నిరాశ తప్పలేదు. ఆమె కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 62 కిలోల విభాగంలో కాంస్యం కోసం జరిగిన పోరులో సాక్షి 10-7తో కాసిమోవా (కజకిస్థాన్)ను ఓడించింది.