
హైదరాబాద్: జాతీయ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతేకాదు క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
మోడీ ప్రభుత్వం రెండోసారి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో అన్ని రంగాలు కోటి ఆశలతో ఉన్నాయి. ఇప్పటికే అనేక రంగాలను వరాలను ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖేలో ఇండియాపై కూడా వరాలు ప్రకటించారు.
అన్ని స్థాయిల్లో క్రీడలను పెంపొందించేదుకు గాను ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద జాతీయ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ బోర్డు క్రీడాకారుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు.
ఖేలో ఇండియా విషయానికి వస్తే
2017లో ఈ ప్రోగ్రామ్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న ఆటగాళ్లను గుర్తించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో భాగంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఖేలో ఇండియా యాప్ను గత ఫిబ్రవరిలో ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
యువతకు క్రీడల ఆవశ్యకత, ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రానున్న రోజుల్లో భారత్ క్రీడల్లో మరింతగా అభివృద్ధి చెందడానికి.. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ యాప్ దోహదపడనుంది. ఈ యాప్లో 3 ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
18 రకాల క్రీడలకు సంబంధించి నియమ నిబంధనలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడలపట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల డేటా సేకరణ, వివిధ క్రీడల కోసం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ప్లేయర్లకు ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించడం లాంటివి అందుబాటులో ఉంచారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.