
టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు.. భారత్ మిశ్రమ ఫలితాలను అందుకుంటోంది. బాగా అచ్చి వచ్చిన కేటగిరీల్లో ఒక్కో అడుగు వెనక్కే పడుతోంది. స్టార్ షూటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. అంచనాలకు అనుగుణంగా సత్తా చాటలేకపోయారు. ఒకవంక అర్చరీలో దీపికా కుమారి- 1/8 ఎలిమినేషన్ రౌండ్లో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ను ఓడించి.. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టిన చోట.. షూటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు.
అసాకా షూటింగ్ రేంజ్లో నిర్వహించిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ క్వాలిఫికేషన్ కేటగిరీలో భారత స్టార్ షూటర్లు మను భాకర్, రాహి సర్నోబత్ రాణించలేకపోయారు. రాహి సర్నోబత్తో ఈ ఈవెంట్ ఆరంభమైంది. తన తొలి సిరీస్లల్లో ఆమె 96, 97 పాయింట్లను సాదించారు. ఫస్ట్ బ్యాచ్లో ఉన్న 10 మంది షూటర్లలో ఆమె ఆరో స్థానంలో నిలిచారు. ఈ కేటగిరీలో అరునోవిక్ టాప్ పొజీషన్లో ఉన్నారు. మూడో సిరీస్లో రాహి సత్తా చాటలేకపోయారు. 94 పాయింట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగారు.
దీనితో ఆరు నుంచి ఎనిమిదో స్థానానికి దిగజారారు. ఆ తరువాత ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయారామె. 96,97,94 స్కోరుతో సగటున 9.57 పాయింట్లను ఆర్జించారు. ప్రిసిషన్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రాహి 287 పాయింట్లను మాత్రమే సాధించగలిగారు. ఆ సెట్ ముగిసిన తరువాత మను భాకర్ పిస్టల్ అందుకున్నారు. తొలి సిరీస్లో అద్భుతం అనిపించారు మను భాకర్. 10,10,10 స్కోర్ను సాధించారు.
ఆ నిలకడను కొనసాగించలేకపోయారు. 10,10,10,9,9, ఇలా క్షీణిస్తూ వచ్చింది. సిరీస్-1లో 97 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. సిరీస్-2లో తన స్థానాన్ని కొద్దిగా మెరుగుపర్చుకున్నారు. మళ్లీ 97 పాయింట్లను సాధించి.. తొమ్మిదో స్థానంలో నిలిచారు. మూడో సిరీస్లో దూకుడును కొనసాగించారు. 10,10,10,9,9,10,10,10,10,10 షాట్లతో అయిదో స్థానానికి ఎగబాకారు. అనంతరం ర్యాపిడ్ ఫైర్ స్టేజీలోకి ఎంట్రీ అయ్యారు. ఈ స్టేజీలో ఆమె ప్రారంభంలో సత్తా చాటారు. తొలి అయిదు షాట్లతో 49 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
అదే స్థిరత్వాన్ని కనపర్చలేకపోయారు. మలి రౌండ్లలో వెనుక పడ్డారు. ర్యాపిడ్ ఫైర్ స్టేజీలో ఒక దశలో తొమ్మిదో స్థానంలో నిలిచినా.. పోటీ తీవ్రంగా ఉండటం.. తన ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోవడంతో ఆమె పొజీషన్ మరింత దిగజారింది. 97 పాయింట్లతో 11వ స్థానానికి పడిపోయారు. ఈ కేటగిరీలో రాహి సర్నోబత్ 18వ స్థానంలో నిలిచారు.