
టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ 2021లో మహిళలు ఆధిపత్యాన్ని కనపరుస్తోన్నారు. పలువురు అథ్లెట్లు తమ దేశానికి బంగారు పతకాలను ఆర్జించి పెడుతున్నారు. దీనికి భారత్ కూడా మినహాయింపేమీ కాదు. ఈ ఒలింపిక్స్లో ఇప్పటిదాకా భారత్ రెండు పతకాలను అందుకుంది. ఈ రెండు కూడా మహిళల ఖాతాలోకి వెళ్లినవే. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను ఇప్పటికే రజతాన్ని అందుకోగా.. బాక్సింగ్ విభాగంలో లవ్లీనా బొర్గోహెయిన్కు కూడా రజతమే ఖాయమైంది. ఒక పతకం అందుకోవడమే గగనమైన వేళ.. దక్షిణ కొరియా మహిళా అర్చర్ ఏకంగా మూడు స్వర్ణాలను ముద్దాడారు.
మహిళల అర్చరీ విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన యన్ సాన్ స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. మహిళల అర్చరీ వ్యక్తిగత కేటగిరీలో ఆమె టాప్ పొజీషన్లో నిలిచారు. క్వార్టర్ ఫైనల్స్లో భారత స్టార్ అర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది యన్ సాన్ చేతిలోనే. అర్చరీ కేటగిరీలోనే ఆమె మూడు బంగారు పతకాలను కొల్లగొట్టారు. ఒక ఒలింపిక్స్లో ఒకే ఈవెంట్లో ఓ అథ్లెట్.. మూడు స్వర్ణాలను సాధించడం రికార్డు. 117 సంవత్సరాల తరువాత అలాంటి ఘనతను సాధించారామె. 1904 తరువాత అర్చరీలో కేటగిరీలో మూడు బంగారు పతకాలను అందుకోవడం ఇదే తొలిసారి.
మహిళల అర్చరీ వ్యక్తిగత విభాగం టైబ్రేకర్లో రష్యా ఒలింపిక్స్ కమిటీకి చెందిన ఎలీనా ఒసిపొవాను యన్ సాన్ 6-5 తేడాతో ఓడించారు. ఇదే కేటగిరీలో దక్షిణ కొరియా మిక్స్డ్, విమెన్స్ టీమ్లో దక్షిణ కొరియా ఇదివరకే బంగారు పతకాలను అందుకుంది. ఈ విభాగంలో ఎలీనా ఒసిపొవా రజతం, ఇటలీ అర్చర్ ల్యూసిల్లా బోవారి కాంస్యాన్ని గెలుచుకున్నారు. టైబ్రేకర్లో యన్ సాన్ 10 పాయింట్లు సాధించగా.. ఎలీనా ఒసిపొవా ఎనిమిది వద్దే నిలిచారు. యన్ సాన్ టీమ్ మేట్ కంగ్ ఛెయ్-యంగ్ అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్స్ స్టేజీలోనే వెనుదిరిగారు. మొదటి నుంచి చివరి వరకూ యన్ సాన్ నిలిచారు.