అద్భుతమైన సాహసం:
'15 సంవత్సరాల వయస్సు గల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని 7 రోజులలో 1200కిమీ సైకిల్ తొక్కి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. అది ఎంతో అందమైన ఓర్పుతో కూడిన ప్రేమ. తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమ అద్భుతం. అద్భుతమైన సాహసం' అని ఇవాంక ట్రంప్ ట్విటర్లో కొనియాడారు. జ్యోతి సాహసాన్ని దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడా గుర్తించిందని ఆమె ట్వీట్ చేశారు.
ఇంటి అద్దె చెల్లించలేక:
బిహార్కు చెందిన మోహన్ పాశ్వాన్ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్లో ఆటో నడిపేవారు. లాక్డౌన్కు ముందే మోహన్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. మార్చిలో తండ్రిని చూడ్డానికి వచ్చిన మోహన్ కుమార్తె జ్యోతి కుమారి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. మోహన్ నడవలేని స్థితిలో ఉండటంతో ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేకపోయింది. ఇల్లు ఖాళీ చేయమని యజమాని ఒత్తిడి తెచ్చాడు.
1200కిమీ సైకిల్ తొక్కి:
గురుగ్రామ్లో ఉండటం కష్టంగా మారి, తన తండ్రితో సహా జ్యోతి బిహార్లోని సొంతూరు దార్భంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ ట్రక్ డ్రైవర్ను అడిగితే దర్భాంగా వెళ్లేందుకు రూ. 6,500 అడిగాడట. అప్పటికీ బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో.. తనవద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో సైకిల్ కొని దానిపై 1200 కిమీ దూరంలో ఉన్న సొంతూరుకు వెళ్లాలనుకుంది. అనుకున్న ప్రకారం సైకిల్ కొని తన తండ్రిని వెనకాల కూర్చొబెట్టుకొని జ్యోతి ప్రయాణం సాగించింది. ఆ ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని చివరకు ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది.
సైకిల్ తొక్కినందుకు భయపడలేదు:
'రాత్రుళ్లు సైకిల్ తొక్కినందుకు నేను భయపడలేదు. కానీ వాహనాలు వెనకనుంచి ఎక్కడ ఢీకొంటాయోనని ఆందోళన చెందా. అదృష్టవశా త్తు అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు' అని జ్యోతి చెప్పింది. ఆమె చేసిన సాహసం సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ వార్త తెలిసి భారత సైక్లింగ్ సమాఖ్య జ్యోతిని ట్రయల్స్కు ఆహ్వానించింది. వచ్చేనెల డిల్లీలో నిర్వహించే ట్రయల్స్లో ఆమె అర్హత సాధిస్తే జాతీయ సైక్లింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని సమాఖ్య వెల్లడించింది.