2021లోనే ఒలింపిక్స్:
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టోక్యో ఒలింపిక్స్ వాయిదా వేయబోతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సభ్యుడు డిక్ పౌండ్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. 2021 జూలై 24-ఆగస్టు 9 మధ్య ఒలింపిక్స్ జరపనున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే సరైన వివరాలు వచ్చే నాలుగు రోజుల్లో తెలియజేస్తాం అని చెప్పారు. 'ఒలింపిక్స్ వాయిదా వేయడానికి నిర్ణయించారు. ముందుకు వెళ్లే ఆలోచన అయితే లేదు. జూలై 24న ఆటలు ప్రారంభం కావడం లేదు. ఇక్కడివరకు నేను చెప్పగలను' అని డిక్ పౌండ్ అన్నారు.
ఉపసంహరించుకున్న కెనడా:
కొవిడ్-19 కారణంగా చాలా దేశాల్లో ఆంక్షలు నిర్వహించడం పోటీల షెడ్యూలును దెబ్బతీసింది. సాధన చేయడం అసాధ్యం కావడమే కాదు.. ప్రమాదకరంగానూ మారింది. చాలా మంది అథ్లెట్లు క్రీడలను వాయిదా వేయాలని కోరుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో కెనడా.. ఒలింపిక్స్, పారాలింపిక్స్ నుంచి తప్పుకొన్న తొలి దేశంగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణ సరికాదని, ఏడాది పాటు వాయిదా వేయాలని అభిప్రాయపడింది.
ఓ నెల రోజులు ఆగుతాం:
ఓ నెల రోజులు ఆగి టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చెప్పింది. 'మరో 4, 5 వారాలు నిరీక్షించాక.. ఐఓసీ, క్రీడా మంత్రిత్వ శాఖలను సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటాం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు' అని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నాడు. వచ్చే ఏడాది కోసమే సిద్ధం కావాలని తమ అథ్లెట్లకు పిలుపు ఆసీస్ చెప్పింది.
అంత తేలికేమీ కాదు:
ఒలింపిక్స్ను వాయిదా వేయడం అంత తేలికేమీ కాదు. ఎంత కాలం వాయిదా వేస్తారన్నదానిపై అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికే 2021 ఆటల క్యాలెండర్ కిక్కిరిసిపోయి ఉంది. ఆ ఏడాదికి ఒలింపిక్స్ను వాయిదా వేస్తే.. అథ్లెట్లు, పాలకులు, ప్రసారదారులకు పెను సమస్యలు తప్పవు. 2021 ఆగస్టులో అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ జరగాల్సివుంది. ఈ ఛాంపియషిప్స్లో అథ్లెట్లు, ప్రసారదారులు భారీగా ఆర్జిస్తారు. ఇక ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు జపాన్లోనే జరగాల్సివుంది. వీటికి 2020ల జరగాల్సిన ఫుట్బాల్ ఐరోపా ఛాంపియన్షిప్ కూడా 2021కి వాయిదా పడ్డాయి.
జపాన్ ప్రభుత్వం కీలక వ్యాఖ్య:
కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా వేయడానికి సంబంధించి తొలిసారి జపాన్ ప్రభుత్వం నుంచి కీలక వ్యాఖ్య వినిపించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వాయిదా తప్పకపోవచ్చని స్వయంగా జపాన్ దేశ ప్రధాని షింజో అబె ప్రకటించారు. ‘ఒలింపిక్స్ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాటిని వాయిదా వేయడమే మంచిది. అథ్లెట్ల ఆరోగ్య భద్రత అన్నింటికంటే ప్రధానం కాబట్టి వాయిదా తప్పకపోవచ్చు' అని అబె అన్నారు.