ఢిల్లీ: రాబోయే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన 148 మంది అథ్లెట్లు (అన్ని క్రీడలతో కలిపి) కరోనా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. పారా ఒలింపిక్స్ ఆటగాళ్లతో కలిసి ఈ సంఖ్య 163 అని ఆయన వెల్లడించారు.148 మంది అథ్లెట్లలో ఇప్పటికే 17 మంది రెండు డోసులు తీసుకున్నారన్నారు. 148 మంది జూలై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. కరోనా కట్టడిలో భాగంగా భారత దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.
అతడే నన్ను 'పవర్ ప్లే' బౌలర్గా మార్చేశాడు.. నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లా: దీపక్ చహర్
'మొత్తం 148 మంది అథ్లెట్లలో 17 మంది టీకా రెండు డోసులు వేసుకున్నారు. మరో 131 మంది తొలి విడత వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులూ ఉన్నారు. అలాగే 13 మంది పారా ఒలింపిక్స్ అథ్లెట్లు కూడా తొలి విడత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో ఇద్దరు రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో కలిపి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్న అథెట్ల సంఖ్య 163. ఇందులో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోయే ఆటగాళ్లలో 87 మంది తొలివిడత డోసులు వేసుకోగా.. 23 మంది రెండు డోసులు వేసుకున్నారు' అని నరేందర్ బత్రా పేర్కొన్నారు.
గతేడాది జరగాల్సి ఉన్న ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. ఈ ఏడాది కూడా మెగా టోర్నీ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఉపాధ్యక్షుడు జాన్ కోట్స్ స్పందించారు. కరోనా ఉద్ధృతి కారణంగా జపాన్లోని టోక్యోతో సహా మిగతా ప్రాంతాల్లో అత్యయిక స్థితి ఉన్నప్పటికీ.. మరో రెండు నెలల్లో ఒలింపిక్స్ ఆరంభమవుతాయని స్పష్టం చేశారు. ఏడాది పాటు వాయిదా పడ్డ ఆ మెగా క్రీడల నిర్వహణకు బాధ్యుడిగా ఉన్న అతను.. టోక్యో నిర్వాహకులతో జరిగిన మూడు రోజుల తుది ప్రణాళిక సమావేశాల ముగింపు కార్యక్రమంలో శుక్రవారం వర్చువల్గా మాట్లాడారు.
జులై 23న ఆరంభించాలని తలపెట్టిన ఒలింపిక్స్ను నిర్వహించకూడదంటూ 60-80 శాతం జపాన్ దేశ ప్రజలు కోరుతున్నట్లు సర్వేల్లో తేలింది. అయితే ప్రజలందరూ టీకా తీసుకుంటే ఆ అభిప్రాయంలో మార్పు వస్తుందని జాన్ కోట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ ఆ దేశంలో 2 శాతం ప్రజలకు మాత్రమే టీకా వేశారు. ఒలింపిక్స్లోని వివిధ క్రీడాంశాల్లోని కోటా స్థానాలు 80 శాతం అర్హత టోర్నీల ద్వారా, 20 శాతం ర్యాంకింగ్ ఆధారంగా భర్తీ చేస్తామని కోట్స్ తెలిపారు. మరోవైపు టోక్యో వైద్య నిపుణుల సంఘం ఈ ఒలింపిక్స్ను రద్దు చేయాలంటూ ప్రధాని సుగాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.