టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు భారత్ మరో ఈవెంట్లో పరాజయాన్ని చవి చూసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళల బాక్సింగ్ విభాగంలో ఓటమిని చవి చూసింది. 57-60 కేజీల మహిళల లైట్వెయిట్ బాక్సింగ్ విభాగానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న టాప్ బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ ఓటమిపాలయ్యారు. ఈ రౌండ్లో ఆమె థాయ్లాండ్ బాక్సర్ సుడాపొర్న్ సీసొండీతో ఓడిపోయారు. దీనితో ఈ విభాగంలో కూడా భారత్ ఇక ముందుడుగు వేసే పరిస్థితి కనిపించట్లేదు. రౌండ్-16 నుంచి వైదొలగినట్టయింది.
Pugilist @Simranjitboxer will be in action soon.
— SAIMedia (@Media_SAI) July 30, 2021
We wish her the best for her bout!
Watch this space for more on #Olympics updates
#Boxing | #Tokyo2020 | #Cheer4India pic.twitter.com/TxbKjortJo
నిజానికి- సిమ్రన్జిత్ కౌర్కు ఇది టఫ్ కాంపిటీషన్. సుడాపోర్న్ వరల్డ్ ఛాంపియన్ మెడలిస్ట్. సిమ్రన్జిత్ కూడా ఇదివరకు ఇదే కేటగిరీలో పతకాన్ని గెలచుకున్నారు. టోక్యోలోని కొకుగికన్ బాక్సింగ్ ఎరీనాలో నిర్వహించిన ఈ ప్రిలిమినరీ రౌండ్ 16లో తొలి బౌట్లో ఇద్దరి మధ్య హోరాహోరి పోరు సాగింది. ఈ బౌట్లో సుడాపోర్న్ స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచారు. ఆమె సంధించిన పంచ్ల నుంచి సిమ్రన్జిత్ మెరుపు వేగంతో తప్పించుకోగలిగారు. రెండో రౌండ్లో సుడాపోర్న్ సత్తా చాటారు. పంచ్లను విసరడంలో లెఫ్ట్ హ్యాండ్ను ప్రయోగించారు. అద్భుతమైన ఫుట్వర్క్తో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టెక్నికల్గా పూర్తి పైచేయిని సాధించినట్టు కనిపించారు.
ఊరించి..ఉసూరుమనిపించి: మరో కేటగిరీలో ముగిసిన భారత ప్రస్థానం
ఏ దశలో కూడా సిమ్రన్ తన ఆటతీరును మెరుగుపర్చుకోలేకపోయారు. గాడిన పెట్టలేకపోయారు. ఫలితంగా ఈ రౌండ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. 5-0తో సుడాపోర్న్ సునాయసంగా బౌట్ గెలుచుకోగలిగారు. 2019లో సుడాపోర్న్ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో రజత పతకాన్ని అందుకున్నారు. ఈ ఏడాదే స్పెయిన్లోని క్యాస్టెల్లాన్లో నిర్వహించిన బోక్జామ్ ఇంటర్నేషనల్్ టోర్నమెంట్లో సుడాపోర్న్ రజత పతకాన్ని సాధించారు. అదే ఫామ్ను ఇక్కడా కొనసాగించారు.
పంజాబ్ నుంచి వచ్చిన తొలి మహిళా బాక్సర్గా గుర్తింపు పొందిన సిమ్రన్జిత్ కౌర్కు లైట్ వెయిట్ విభాగంలో పది సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని అద్భుత విజయాలు, అంతర్జాతీయ స్థాయి పతకాలను ఆమె సొంతం చేసుకున్నారు. మహిళల బాక్సింగ్ విభాగంలో సిమ్రన్జిత్ కౌర్ ఓటమి చేదు ఫలితాన్ని అందించే అవకాశాలు లేకపోలేదు. ఇదే ఈవెంట్ నుంచి స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఓడిపోయారు. ప్రస్తుతం లవ్లీనా బొర్గోహెయిన్ బాక్సింగ్ విభాగంలో ఉన్నారు.