
హైదరాబాద్: భారత క్రీడా సంస్కృతిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అన్నారు. వచ్చేఏడాది మే-జూన్ మధ్యలో నిర్వహించే పాఠశాల స్థాయి, జాతీయ స్థాయి టాలెంట్ హంట్ గురించి బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాథోడ్ మాట్లాడారు.
దేశంలో క్రీడా సంస్కృతిని మార్చడానికి అందరూ సమష్టిగా పనిచేస్తే 100 మంది బోల్ట్లను తయారు చేయగలమని ఆయన అన్నారు. ఈ సెలక్షన్ ప్రక్రియలో మార్పులు, క్రీడాకారులను గుర్తించడంలో మెలకువలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
చిన్నతనం నుంచే ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంటే అనతి కాలంలోనే అంతర్జాతీయస్థాయిలో అద్భుతాలు సృష్టించే అవకాశముందని అన్నారు. ఇందుకు ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల నుంచి తోడ్పాటు లభిస్తే భారత్ నుంచి వంద మంది ఉసేన్ బోల్ట్లను తయారవుతారని తెలిపారు.
'సామర్థ్యాలను బట్టి అథ్లెట్లను ఎంపిక చేయడంలో మనదేశంతో పోల్చుకుంటే మిగతా దేశాలు మనల్ని మించి పోయాయి. మేం ఈ ప్రక్రియను మార్చాలనుకుంటున్నాం. 12 ఏళ్ల వయసులోనే 5 అడుగుల 11 అంగుళాలు ఉన్న వ్యక్తిని వాలీబాల్ లేదా బాస్కెట్బాల్ జట్లకు ఎంపిక చేస్తాం' అని రాథోడ్ సూచించాడు.
'మరో వ్యక్తికి చేతికి కన్ను, చేతి సమన్వయంగా సరిగా ఉండదు. కానీ చాలా వేగం పరుగెత్తుతాడు. అతను వేగంగా 100 మీటర్ల పరుగును పూర్తి చేసే సామర్థ్యం ఉంటే ఆ పరుగులో పోటీపడేలా శిక్షణ అందిస్తాం' అని రాథోడ్ అన్నారు. '125 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి 100 మంది బోల్ట్లను తయారు చేస్తే సత్తా ఉందని నమ్ముతా' అని చెప్పారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.