హైదరాబాద్: పతకాల పరంపరను కొనసాగిస్తానంటూ మాటిచ్చాడు సుశీల్ కుమార్. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఏప్రిల్ ప్రథమార్థంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. అదే జోరుతో రాబోయే ఆసియన్ గేమ్స్లోనూ తన సత్తా చాటుతానని ధీటైన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.
'కామన్వెల్త్ క్రీడల్లో లభించిన విజయాన్నే ఆసియన్ గేమ్స్లోనూ పునరావృతం కావాలని కోరుకుంటున్నాను. ఇందుకు భారత ప్రజల ఆశీస్సులు ఎంతో ముఖ్యం. వారి మద్దతు లేనిదే విజయం సిద్ధించదు. ఆట ఆడేటప్పుడు అభిమానుల వద్ద నుంచి వచ్చే స్పందనే మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఏ క్రీడాకారుడికైనా ప్రధానం బలం అభిమానులే అని భావిస్తాను. ఆటలో ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే ముందు నేను మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. ఇన్నేళ్లుగా అదే నన్ను నడిపిస్తోంది, గెలిపిస్తోంది.' అని తెలిపాడు.
'క్రీడాకారులకు స్థానిక ప్రభుత్వాలు అండగా నిలవాలి. ప్రతి దేశంలోనూ ఒక్కో ఆటకు సంబంధించిన నిష్ణాతులు ఉంటారు. మనదేశంలో రెజ్లింగ్ విభాగంలో నేను ఆ స్థాయికి వెళ్లాలనుకుంటున్నాను. ఆసియన్ గేమ్స్, ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను. యువత క్రీడల్లోకి వస్తే బాగుంటుంది. క్రీడల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచే పిల్లలకు కలిగించాలి.' అని తెలిపారు.
आपके प्यार का बहुत बहुत धन्यवाद आप सभी के द्वारा दी गई मेरे जन्मदिन की शुभकामनाओं का दिल से शुक्रिया 🙏🏻
— Sushil Kumar (@WrestlerSushil) May 26, 2018
2018 ఆసియన్ గేమ్స్ ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకూ జరగనున్నాయి. ఈ క్రీడలకు ఇండోనేసియా ఆతిథ్యం ఇవ్వనుంది. కామన్వెల్త్ క్రీడల్లో కనబర్చిన జోరే ఈ క్రీడల్లోనూ కొనసాగించాలని భారత క్రీడాకారులు భావిస్తున్నారు.