హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీల్లో హైదరాబాద్కు చెందిన అరుణ బుద్ధా రెడ్డి కాంస్య పతకం గెలుపొందింది. తద్వారా జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ పోటీల్లో కాంస్య పతకం గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
మహిళల వాల్ట్స్ విభాగంలో నిర్వహించిన పైనల్స్లో అరుణ రెండుసార్లు పోటీపడి 13.649 యావరేజితో మూడో స్థానంలో నిలిచింది. స్లొవేనియాకు చెందిన కైసెల్ప్ (13.800) స్వర్ణం గెలుచుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి వైట్హెడ్(13.699) రజతం దక్కించుకుంది.
ఇదే ఈవెంట్లో మరో భారత అమ్మాయి ప్రణతి నాయక్ 13.416 యావరేజితో ఆరో స్థానంలో నిలిచింది. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్లో భారత్ తరుఫున పతకం గెలిచిన తొలి మహిళగా అరుణ చరిత్ర సృష్టించింది. అంతేకాదు జిమ్నాస్టిక్స్లో అంతర్జాతీయ స్ధాయిలో భారత్కు ఇది మూడో పతకం కావడం విశేషం.
2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో జిమ్నాస్టిక్స్లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయుడిగా అశిష్కుమార్ నిలిచారు. 2014 కామన్వెల్త్ గేమ్స్లో దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్లో కాంస్య పతకం దక్కించుకుంది. ఇదిలా ఉంటే హైదారాబాద్కు చెందిన 22 ఏళ్ల అరుణ బుద్ధా రెడ్డి కరాటేలో బ్లాక్బెల్ట్ పొందారు.
2014 కామన్వెల్త్ గేమ్స్లో అరుణ అర్హత పోటీల్లో 14వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసియా గేమ్స్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ఆమె గతంలో జిమ్నాస్టిక్స్లో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. 2017 ఆసియా ఛాంపియన్షిప్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
WAG Vault Medal Ceremony 🏅#GymnasticsWorldCup #MelbWC18 #VisitVictoria #VisitMelbourne pic.twitter.com/Hozv3xcsHX
— World Cup Gymnastics (@gymworldcup) February 24, 2018