బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత స్టార్ బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి అస్సామీ మహిళగా లోవ్లినా పేరుగాంచింది. ప్రస్తుతం బర్మింగ్హామ్లో జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు ఆమె సన్నద్దమవుతుంది. మరో మూడు రోజుల్లో కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న తరుణంలో బాక్సర్ లోవ్లినా చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. బీఎఫ్ఐ ఆమెతో డర్టీ పాలిటిక్స్ ఆడుతోందని ఆరోపణలు చేస్తూ ఆమె ట్విట్టర్లో సుదీర్ఘ పోస్టు చేసింది.
— Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022
ఈరోజు ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నా. నాపై వేధింపులు జరుగుతున్నాయని చాలా బాధతో వెల్లడిస్తున్నా. ఒలింపిక్ పతకం సాధించడంలో నా వెన్నంటి నిలిచిన నా ఇద్దరు కోచ్లను పదే పదే తొలగిస్తూ నా శిక్షణ ప్రక్రియకు చాలా ఆటంకం కలిగిస్తున్నారు. నా కోచ్లలో ఒకరు ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన సంధ్యా గురుంగ్జీ. మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కో. నా ఇద్దరు కోచ్లను నా శిక్షణ కోసం పంపించండి అని ప్రతిసారి మొత్తుకోవాల్సి వస్తుంది. చాలా సార్లు అభ్యర్థిస్తే చివర్లో ఒకట్రెండు రోజుల ముందు పంపిస్తారు. ఈసారి అదే జరిగింది. వారు చాలా ఆలస్యంగా బర్మింగ్ హమ్ వచ్చారు.' అని లోవ్లినా తన ట్వీట్లో పేర్కొంది.
'ఈ శిక్షణ శిబిరాల్లో నేను చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తద్వారా మెంటల్ హరస్మెంట్కు గురవుతున్నాను. ప్రస్తుతం నా కోచ్ సంధ్యా గురుంగ్జీ కామన్ వెల్త్ విలేజ్ వెలుపల ఉన్నారు. ఆమెకు ఎంట్రీ కూడా దక్కడం లేదు. ఇంకో కోచ్ రఫేల్ సార్ను ఇండియాకు పంపించేశారు. నేను ఎంత బతిమాలినా వినలేదు. ఎనిమిది రోజులుగా నా ప్రాక్టీస్ ఆగిపోయింది. ఇలాంటి కారణాల వల్లే గత ప్రపంచ ఛాంపియన్షిప్ కూడా మిస్సయింది. ఈ డర్టీ రాజకీయాల వల్ల కామన్ వెల్త్ గేమ్స్ అవకాశాన్ని నేను పాడుచేయాలని కోరుకోవడం లేదు. నా దేశం కోసం ఈ డర్టీ రాజకీయాలను సైతం మర్చిపోయి ఇండియాకు పతకం తీసుకురాగలనని ఆశిస్తున్నాను' అని లోవ్లినా పేర్కొంది.