
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన 21వ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతా తెరిచింది. వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించారు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచారు.
మలేసియా వెయిడ్ లిఫ్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్ 261 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకం సాధించగా, శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సాధించారు. కాగా, కోస్టల్ కర్ణాటకలోని కుందపురకు చెందిన గురురాజా తొలుత రెజ్లర్గా కెరీర్ ప్రారంభించి పవర్ లిఫ్టింగ్కు, ఆ తర్వాత వెయిట్లిఫ్టింగ్కు మారారు.
బ్యాడ్యింటన్లో అదుర్స్:
మరోవైపు బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్లో శ్రీలంకపై 3-0తేడాతో భారత్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ మిక్స్ డ్ టీమ్ గ్రూప్-ఎలో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. శ్రీలంకకు చెందిన మదుషిక దిల్రుక్షిపై 21-8, 21-4 తేడాతో ఏకపక్షంగా గెలిచింది.
హాకీలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. తొలి మ్యాచ్లోనే వేల్స్ చేతిలో 2-3 తేడాతో భారత్ పరాజయం పాలైంది.