ఒలింపిక్ జ్యోతి జపాన్ చేతుల్లో:
1896లో తొలి ఆధునిక ఒలింపిక్స్ వేదిక పానెతెనాయిక్ స్టేడియంలో జ్వలింపజేసిన జ్యోతిని జపాన్ ప్రతినిధికి బహూకరించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పోటీపడిన స్విమ్మర్ నవోకో ఇమాటో ఆ జ్యోతిని అందుకుంది. ఆ తర్వాత దాన్ని ఉపయోగించి ఓ దీపాన్ని వెలిగించారు. ఇక ప్రత్యేక విమానంలో ఆ దీపాన్ని జపాన్కు తీసుకురానున్నారు. గ్రీసులో ఒలింపిక్ జ్యోతిని వెలిగించి.. దాన్ని ఆతిథ్య నగరానికి అందజేయడం ఆనవాయితీ. ఈ నెల 12న గ్రీసులో సంప్రదాయ పద్ధతిలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం టోక్యోకు జ్యోతి:
ఒలింపిక్ జ్యోతి శుక్రవారం టోక్యోకు చేరనుంది. 'టోక్యో 2020 ఒలింపిక్స్ టార్చ్ రిలే' అని పెయింట్ వేసి ఉన్న తెల్ల విమానంలో జ్యోతి రానుంది. ఉత్తర జపాన్లో మత్సుషిమ ఎయిర్ బేస్లో జ్యోతిని స్వాగతించడానికి కొద్ది మంది ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. జపాన్లో అధికారికంగా టార్చ్ రిలే ఈ నెల 26న ఫుకుషిమలో ఆరంభమవుతుంది. ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా షెడ్యూలు ప్రకారం జులై 26నే క్రీడలు ఆరంభమవుతాయని చెబుతోన్న అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, స్థానిక నిర్వాహకులకు టోక్యోకు జ్యోతి రావడం చిన్నపాటి విజయమే అవుతుంది. అయితే కరోనా రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుండడంతో.. నాలుగు నెలల జ్యోతి యాత్రలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
విశ్వక్రీడలు ఆలస్యం కావచ్చు:
టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది ఆఖరుకు వాయిదా పడే అవకాశం ఉందని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కోయ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జూలైలో కాకుండా ఆలస్యంగా జరిగే అవకాశం ఉందన్నాడు. అయితే ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమన్నాడు. 'ప్రస్తుత పరిణామాల దృష్ట్యా గేమ్స్ ఆలస్యమయ్యే విషయాన్ని కొట్టివేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సాధ్యమే. కానీ ఇప్పటికిప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకునే స్థితిలో ఐఓసీ లేదు. మరోసారి సమావేశమై వాయిదాపై చర్చిస్తాం' అని టోక్యో ఒలింపిక్ గేమ్స్ కోఆర్డినేషన్ కమిషన్లో కూడా సభ్యుడైన సెబాస్టియన్ వివరించారు.