
హైదరాబాద్: అదృష్టం అంటే ఆస్ట్రేలియా బాక్సర్ టైలా రాబర్ట్సన్దే. కామన్వెల్త్ గేమ్స్లో ఇంకా పోటీలే మొదలవలేదు. కానీ రాబర్ట్సన్కు పతకం ఖాయమైంది. బుధవారం ఆరంభోత్సవం జరగ్గా, నేటి నుంచి పోటీలకు తెరలేవనుంది. అయితే మహిళల 51 కేజీల విభాగంలో పోటీదారులు లేక ఈ ఈవెంట్లో 'డ్రా' కుదించుకుపోయింది.
ఇందులో 19 ఏళ్ల టేలాకు 'బై' లభించడంతో ఏకంగా సెమీస్లోకి ప్రవేశించింది. రాబర్ట్సన్ పోటీపడుతున్న మహిళల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో పోటీ పడే బాక్సర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక్క బౌట్ ఆడకుండానే ఆమె నేరుగా సెమీస్ చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది.
''పతకం సాధించడం బాగుంది. కానీ నాకు స్వర్ణం కావాలి. సెమీస్లో ఎవరితో తలపడతానో తెలీదు కానీ దానికి నేను సిద్ధంగా ఉన్నా'' అని పంతొమ్మిదేళ్ల రాబర్ట్సన్ తెలిపింది. బాక్సింగ్ పోటీల్లో సెమీస్లో ఓడినా... కాంస్యమైనా దక్కితీరుతుంది. కానీ తను మాత్రం కాంస్యంతోనే సరిపెట్టుకోనని... స్వర్ణం కోసమే పోరాడతానని ఆమె చెప్పుకొచ్చింది.
ఇంకా మాట్లాడుతూ.. 'కష్టపడి ట్రైనింగ్ పూర్తి చేశాను. సెమీ ఫైనల్ కు ప్రత్యర్థి ఎవరొస్తారనే ఆలోచనే లేదు. ఖచ్చితంగా గెలిచితీరుతాననే నమ్మకం నాకుంది. లక్కీగా డ్రాలో ఎవరూ లేకపోవడంతో సెమీ ఫైనల్ వరకు వెళ్లినా అంత సులువుగా గెలుపుని ఒప్పుకోను. కష్టపడి స్వర్ణ పతకం గెలుచుకుంటా' అని వివరించింది.