
హైదరాబాద్: ట్యునీషియా వేదికగా జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. హర్యానాకు చెందిన ఏక్తా భ్యాన్ రెండు పతకాలతో మెరిసింది. వీల్ ఛైర్కే పరిమితమైన ఏక్తా భ్యాన్ మహిళల క్లబ్ త్రోలో స్వర్ణం పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
ఆ తర్వాత ఇదే టోర్నీలో మహిళల డిస్కస్ త్రో విభాగంలో వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ పారా అథ్లెటిక్స్లో భారత్ తరుపున మెరిసిన ఏక్తా భ్యాన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఏక్తా భ్యాన్ జీవితం ధైర్యం మరియు విశ్వాసంతో కూడుకున్నది. 2003లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయాలు అవడంతో పక్షవాతం కారణంగా శరీరం కింది భాగం పూర్తిగా స్పర్శను కోల్పోయింది.
దీంతో వీల్ ఛైర్కే పరిమితమైంది. ఢిల్లీలోని ఇండియన్ స్ఫైనల్ ఇంజురీ సెంటర్లో చికిత్స తీసుకున్న అనంతరం ఏక్తా భ్యాన్ జీవితమే పూర్తిగా మారిపోయింది. తల్లితండ్రులు ఇచ్చిన మద్దతుతో ఏక్తా భ్యాన్ పూరిగా కోలుకుంది. ఏక్తా భ్యాన్ తండ్రి బల్జీత్ బ్యాన్ రిటైర్డ్ హార్టీకల్చర్ ఆఫీసర్.
కష్ట సమయంలో తన కుమార్తెకు వెన్నంటే నిలిచాడు. ఈ రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న ఏక్తా తన చదువుని కొనసాగించింది. హిసార్లోని కాలేజీలో బీఎ(ఇంగ్లీష్ హానర్స్)లో చేరింది. 2009లో హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై తొలి రౌండ్లోనే అర్హత సాధించింది.
అయితే, మెయిన్స్లో విఫలమైంది. 2011లో మళ్లీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన తాను అనుకున్నది సాధించింది. హిసార్లో అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత ఏక్తా జీవితంలో ఏదో తెలియని వెలితి. దీంతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో క్రీడారంగాన్ని ఎంచుకుంది.
క్లబ్ త్రోలో అర్జున అవార్డు గ్రహీత అమిత్ సరోహా వద్ద శిక్షణ తీసుకుంది. 2016లో పంచశుక్లా వేదికగా జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో క్లబ్ త్రోలో స్వర్ణం, డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత బెర్లిన్ వేదికగా జరిగిన ఐపీసీ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో మహిళల క్లబ్ త్రోలో సిల్వర్ పతకం సాధించింది.