హైదరాబాద్: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్, టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్సింగ్ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింనట్లు తెలుస్తోంది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్, ఖేల్రత్న అవార్డుకు హర్భజన్సింగ్ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ద్యుతీ చంద్ విషయానికి వస్తే గడువులోగా దరఖాస్తు చేయకపోవడంతో పాటు సాధించిన పతకాలను సరైన ర్యాంకింగ్లో లేకపోవడం కూడా ఆమె నామినేషన్ తిరస్కరణకు కారణమైంది. దీనిపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అధికారి మాట్లాడుతూ "నామినేషన్లను ర్యాంకింగ్ ఆర్డర్లో ఇవ్వమని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ)ను క్రీడాశాఖ కోరింది. ద్యుతీ ఐదో స్థానంలో ఉంది. దీని వల్ల ఆమె నామినేషన్ను తిరస్కరించారు" అని అన్నారు.
హర్భజన్ సింగ్ విషయానికి వస్తే దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 30 ఆఖరి తేదీ కాగా, పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలు ఆలస్యంగా నామినేషన్ను పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే, తన నామినేషన్ తిరస్కరణకు గురవడంపై ద్యుతీ చంద్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసింది.
అనంతరం ద్యుతీ చంద్ మాట్లాడుతూ "ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిశాను. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. అర్జున అవార్డుకు నామినేషన్ను తిరిగి పంపిస్తానని, రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు" అని అన్నారు.
"ఎందుకంటే ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, తుపాను కారణంగా గడువు తేదీలోపు నా నామినేషన్ను ప్రభుత్వం దాఖలు చేయలేకపోయింది" అని ద్యుతీ చంద్ పేర్కొంది. 2013 నుంచి నిలకడగా రాణిస్తున్నానని, భవిష్యత్తులో దేశం తరఫున మరిన్ని పతకాలు సాధిస్తానని ద్యుతీ చంద్ ఆశాభావం వ్యక్తం చేసింది.