బాక్సర్లకు ఏమీ తెలియదంటూ:
వీటి గురించి మా బాక్సర్లకు ఏమీ తెలియదంటూ భారత తరపు అధికారి తేల్చి చెప్పినా.. గదుల బయట సిరంజీలు బయటపడ్డ ఉదంతంలో భారత బాక్సర్లకు చిక్కులు తప్పేలా లేవు. మొత్తం 12 మంది భారత బాక్సర్లకూ డోప్ పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఫలితాలు రానున్నాయి. సిరంజీలు వాడకున్నా.. అవి భారత బాక్సర్లకు చెందినవే అని విచారణలతో తేలితే నిబంధనల ప్రకారం వారిపై కఠిన శిక్షలు తప్పవు.
అసలు బయటపడిందిలా:
సిరంజీలు తమ ఆటగాళ్లవి కావని భారత జట్టు మేనేజర్ అజయ్ నారంగ్ చెప్పాడు. దారిలో, నలిపేసిన నీళ్ల సీసాలో అవి డోపింగ్ నిరోధ సంస్థ అధికారులకు దొరికాయని తెలిపాడు. శనివారం గోల్డ్కోస్ట్లో భారత సీనియర్ బాక్సర్లు బస చేసిన గదుల బయట సిరంజీలు దొరికాయి.
నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుండగా:
భారత క్రీడాకారులెవరైనా డోపింగ్కు పాల్పడ్డారేమో అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంకో నాలుగు రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ఆరంభం కానున్న తరుణంలో ఈ పరిణామం పెద్ద చర్చకే దారి తీసింది. ఆ సిరంజీలను గమనించిన సిబ్బంది.. తనకు తెలిపారని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీవెంబర్గ్ వెల్లడించారు.
భారత బృందంతో ఉన్న అధికారి:
అయితే... దీనిని భారత బృందంతో ఉన్న అధికారి తీవ్రంగా పరిగణించి, ఖండించారు. 'సిరంజీలు మా ఆటగాళ్ల గదుల్లో దొరకలేదు. వివిధ దేశాల క్రీడాకారులంతా ఉన్న భవనం వద్ద లభించాయి. మేమే వాటిని సీజీఎఫ్ వైద్యాధికారులకు అప్పగించాం. తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు' అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార బృందం...ఆస్ట్రేలియా డోపింగ్ నిరోధ సంస్థ అధికారులు స్థానిక పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు.