న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత మెడల్స్ గెలిచిన ఏకైక భారత అథ్లెట్గా ఘనతను అందుకున్న రెజ్లర్ సుశీల్ కుమార్ హత్య కేసులో ఇరుక్కున్నాడు. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువ రెజ్లర్ మరణించాడు. ఈ ఘర్షణ సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అతను మిగిలిన రెజ్లర్లని ఘర్షణకి పురిగొల్పినట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే.. సుశీల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రసాల్ స్టేడియం సమీపంలో ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్కు చెందిన ఇంట్లో సాగర్ కుమార్, అమిత్ కుమార్, ప్రిన్స్ దలాల్ ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే విషయమై, ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో..తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసాల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలంలో 23 ఏళ్ల సాగర్ కుమార్ చనిపోయి పడి ఉన్నాడు.
అతడిని ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా గుర్తించారు. ఇక ఈ ఘటనలో సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రిన్స్ దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్ చేసి.. పార్క్ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ హత్యలో సుశీల్ కుమార్ హస్తం ఉందని తేలడంతో అతనిపై ఎఫైఆర్ నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు.
కేసు దర్యాప్తు భాగంగా సుశీల్ కుమార్ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశామన్నారు. అక్కడ సుశీల్ కుమార్ లేడని.. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు సుశీల్ కుమార్ ఈ ఆరోపణలు ఖండించాడు. ఆ ఘటనతో తనకు సంబంధం లేదన్నాడు.
2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సుశీల్ కుమార్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. అత్యున్నత క్రీడా పురస్కారాలైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులను అందుకున్నాడు.