కీలక ఈవెంట్లల్లో..
ఇంకా కొన్ని కీలక ఈవెంట్లు ముందు ఉండటంతో ఈ సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. క్రికెట్లో ఇప్పటికే వెండి పతకం ఖాయమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు ఫైనల్స్కు చేరింది. పసిడి పతకం కోసం ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. బ్యాడ్మింటన్, విమెన్స్ బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వంటి కీలక ఈవెంట్లల్లో భారత క్రీడాకారులు సెమీ ఫైనల్స్ వరకు వెళ్లగలిగారు. సెమీస్లో విజయం సాధించితే పతకం ఖాయం అయ్యే దశలో ఉన్నారు.
హాకీతో మొదలు..
భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు హాకీలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంటుంది. 2 గంటలకు- బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో పీవీ సింధు తలపడనుంది. 3:10 గంటలకు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్లో లక్ష్యసేన్, రెండో సెమీఫైనల్స్లో కిడాంబి శ్రీకాంత్.. తమ ప్రత్యర్థులతో తలపడనున్నారు. సాయంత్రం 4 గంటలకు మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీస్లో గాయత్రి గోపిచంద్/జాలీ ట్రెస్సా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పతకాలకు చేరువగా..
పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్స్లో సాత్విక్ రాజ్/చిరాగ్ షెట్టి జోడీ ప్రత్యర్థులను ఢీకొట్టబోతోంది. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీణ్ చిత్రవేల్ పాల్గొననున్నారు. రస్ వాక్ ఫైనల్లో అమిత్, సందీప్ కుమార్, మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్లో భారత థ్రోయర్స్ శిల్పా రాణి, అన్ను రాణి.. పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్స్లో రోహిత్ యాదవ్, డీపీ మను పెర్ఫార్మెన్స్ ఉంటుంది.
నిఖత్ జరీన్ సహా.
బాక్సింగ్ మహిళల లైట్ ఫ్లైవెయిట్లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ తలపడనుంది. ఈ గేమ్ ఈ సాయంత్రం 7 గంటలకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. పురుషుల లైట్ ఫ్లైవెయిట్లో అమిత్ ఫంగల్, హెవీ వెయిట్ ఫైనల్స్లో సాగర్ అహ్లావత్.. సత్తా చూపించనున్నారు. టేబుల్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ రజత పతకం మ్యాచ్లో శ్రీజ ఆకుల తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో ఆచంట శరత్ కమల్/జీ సథియన్ జోడీ- తమ ప్రత్యర్థులను ఢీ కొట్టనుంది. స్క్వాష్ డబుల్స్లో రజత పతం కోసం దీపిక పల్లికల్/సౌరవ్ ఘోషల్ మ్యాచ్ ఉంటుంది.