
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో ఉన్న 'నో నీడిల్స్' పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇద్దరు భారత అథ్లెట్లు రాకేశ్ బాబు, ఇర్ఫాన్ కోలోథమ్ థోడిలు కామన్వెల్త్ క్రీడల నుంచి నిషేదానికి గురైయ్యారు. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్) వారిపై చర్యలు తీసుకుంది. వారిని వెంటనే గోల్డ్కోస్ట్ వదిలి స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఈ ఇద్దరి అథ్లెట్ల గదిలో నీడిల్ దొరకడంతో ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ జంపర్ రాకేశ్, రేస్వాకర్ ఇర్ఫాన్తో కలిసి మరో ముగ్గురు భారత అధికారులు ఫెడరేషన్ ముందు హాజరయ్యారు.
వారు బస చేస్తున్న హోటల్ గదిలో శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది.. బాబు, థోడీ గదుల వద్ద సిరంజీలు ఉండటం గమనించారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ యాంటీ డోపింగ్ అథారిటీకి తెలియజేయడంతో వారిని విచారించారు. వారిద్దరూ తమకు తెలియదనే సమాధానం చెప్పడంతో విసుగుచెందిన అధికారులు వారికి నిషేదాన్ని జారీ చేశారు. వీరితో పాటుగా విక్రమ్ సింగ్ సిసోడియా, నామ్దేవ్ శిర్గోంకర్, రవీందర్ చౌదరీలను కూడా యాంటీ డోపింగ్ అధికారులు మందలించినట్లు సమాచారం.
'నో నీడిల్స్' పాలసీని వీరు ఉల్లంఘించారు. దీంతో గేమ్స్లో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తున్నాం. వారి అక్రిడిటేషన్ను కూడా రద్దు చేశాం. క్రీడా గ్రామం నుంచి కూడా పంపించి వేశాం. వారిని వెంటనే స్వదేశానికి పంపించాల్సిందిగా కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించాం' అని సీజీఎఫ్ అధ్యక్షుడు లూయిన్ మార్టిన్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో మిగతా ముగ్గురు సిబ్బందిని మందలించినట్లు ఆయన చెప్పారు. ఆటగాళ్లు డోపింగ్కు పాల్పడకుండా ఉండేందుకు ఈ 'నో నీడిల్స్ ' పాలసీని అమలు చేస్తున్నారు.
కామన్వెల్త్ నిబంధనల ప్రకారం.. పేరా 1, 2, 3, 4లలో పొందుపరిచినట్లు నో నీడిల్ నిబంధనను ఆటగాళ్లందరూ పాటించాలి. ఒకవేళ సిబ్బంది, మరే ఇతర వ్యక్తులకైనా డయాబెటిస్ వంటి సమస్యలున్న వాల్లు సిరంజీలు వాడాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయీస్ మార్టిన్ తెలిపారు.