|
ఓడినా రజతం ఖాయం..
సెమీ ఫైనల్లో ఆమె ఓడినప్పటికీ..రజత పతకాన్ని అందుకుంటారు. విజయాన్ని గనక సాధించగలిగితే రజతానికి, ఓటమి లేకుంటే స్వర్ణాన్ని సాధించగలరు లవ్లీనా. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం- నాలుగు కేటగిరీల్లో సెమీ ఫైనల్స్కు చేరిన ప్రతి బాక్సర్ కూడా పతకానికి అర్హులే. క్వార్టర్ ఫైనల్స్ టై కావడమో లేదా.. మూడో స్థానంలో నిలవడమో జరిగితే తప్ప- మెడల్ అందుకోలేరు బాక్సర్లు. క్వార్టర్ఫైనల్స్లో లవ్లీనా బొర్గోహెయిన్ అద్భుతంగా సత్తా చాటారు. ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడ్డారు. ఈ గేమ్లో ఆమె విజేతగా ఆవిర్భవించారు. సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. దీనితో ఆమెకు పతకం ఖాయమైంది.
అస్సాం నుంచి మొదటి మహిళా బాక్సర్
ఈశాన్య రాష్ట్రం అస్సాం నుంచి వచ్చిన మొట్టమొదటి మహిళా బాక్సర్.. లవ్లీనా. గోల్ఘర్ జిల్లాలోని బారా ముఖియా ఆమె స్వగ్రామం. ఆమె ఒలింపిక్స్ ప్రయాణంపై ఎలా సాగిందనే విషయంపై ఇండియాటుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తరువాత.. నిర్వహించే సన్నాహాక శిబిరాలకు లవ్లీనా క్రమం తప్పకుండా హాజరు కాలేకపోయారు. ఆమె తండ్రి టికెన్ బొర్గోహెయిన్ సాధారణ రైతు. తల్లి అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీల వ్యాధితో బాధపడుతోన్న తల్లికి.. ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది. ఫలితంగా- ఫిబ్రవరిలో ఆమె తన సన్నాహాక శిబిరం నుంచి అర్ధాంతరంగా కోల్కతకు వెళ్లాల్సి వచ్చింది. ఒలింపిక్స్లో పాల్గొంటూ కనీసం రోజుకు రెండుసార్లు ఆమె తల్లితో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుంటారు.
లాక్డౌన్ సమయంలో ఇంట్లో సిలిండర్లతో..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్డౌన్ సమయంలో ఆమె ఇంట్లోనే ఉంటూ శిక్షణ తీసుకున్నారు. ఫిట్నెస్ కోసం సిలిండర్లను ఎత్తేవారు. ఒలింపిక్స్కు బయలుదేరి వెళ్లే సమయంలో- తాను పతకంతో తిరిగి వస్తానంటూ తల్లికి ప్రామిస్ చేశారని టికెన్ బొర్గోహెయిన్ చెప్పారు. తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చారని, తన కుమార్తె స్వర్ణ పతకంతో స్వదేశానికి చేరుకోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. సెకెండ్ వేవ్ సమయంలో లవ్లీనా సపోర్టింగ్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని, అయినా ధైర్యాన్ని సడలిపోలేదని పేర్కొన్నారు.
2012 నుంచే శిక్షణ..
2012లోనే బాక్సింగ్పై లవ్లీనాకు ఆసక్తి ఏర్పడింది. గువాహటిలోని నేతాజీ సుభాష్ రీజనల్ సెంటర్లో ఆమె శిక్షణ పొందారు. పదుమ్ బోరో ఆమె మొట్టమొదటి కోచ్. బాక్సింగ్తో తన ప్రత్యర్థి బరువును అంచనా వేయడం అత్యవసరమని, దానికి అనుగుణంగా అతణ్ని అలసిపోయేలా చేయాలనేది ప్రాథమిక సూత్రమని కోచ్ అలీ ఖమర్ పేర్కొన్నారు. ఈ రౌండ్లో కూడా లవ్లీనా తన ప్రత్యర్థి బరువు, బలం, బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయవంతమయ్యారని చెప్పారు.
|
మూడో బాక్సర్గా..
ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించిన భారత మూడో బాక్సర్ లవ్లీనా. ఇదివరకు ఒలింపిక్స్ బాక్సింగ్ కేటగిరీలో మేరీ కోమ్, విజేందర్ సింగ్ మాత్రమే పతకాన్ని సాధించారు. ఇప్పుడీ జాబితాలో లవ్లీనా చేరారు. అస్సాంకు చెందిన 23 సంవత్సరాల లవ్లీనాకు ఇదే తొలి ఒలింపిక్స్. కొత్తే అయినప్పటికీ.. ఎక్కడా తడబాటును ప్రదర్శించలేదు. సరైన సమయంలో కౌంటర్ అటాక్ చేశారు. ప్రత్యర్థిని కదలనివ్వలేదు. చైనీస్ తైపే ప్రత్యర్థి బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దూకుడు, ఎదురు దాడే మంత్రంగా రజత పతకాన్ని ముద్దాడబోతోన్నారు. 4-1తో ప్రత్యర్థిని మట్టికరిపించారంటే ఆమె ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు.
స్వగ్రామంలో ఆనందోత్సాహాలు..
లవ్లీనా బొర్గొహెయిన్ సాధించిన ఈ ఘనత పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. పలువురు కేంద్రమంత్రులు ఆమెను అభినందిస్తూ ట్వీట్లను పోస్ట్ చేస్తోన్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారంటూ ప్రశంసలు కురిపిస్తోన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు దక్కిన రెండో పతకం ఇది. ఇదివరకు వెయిట్ లిఫ్టింగ్లో మణిపూర్కు చెందిన మీరాబాయి చాను రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలకే చెందిన అస్సాం యువతి లవ్లీనా.. దేశానికి మరో పతకాన్ని అందించనున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో లవ్లీనా గెలిచిన వెంటనే అస్సాంలోని ఆమె స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.