ఒడిశా: ఆసియా గేమ్స్లో స్ప్రింటర్స్ అద్బుతాలు సృష్టించారు. ఆదివారం జరిగిన పోటీల్లో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతిచంద్కి ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో ఆదివారం 100 మీటర్ల రేసులో పోటీపడిన ద్యుతీచంద్ రజత పతకాన్ని గెలుపొందింది. శరీరంలో పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయనే కారణంతో 2014 ఆసియా గేమ్స్లో పోటీపడనివ్వకుండా ఈ స్టార్ స్ప్రింటర్పై నిషేధం విధించింది.
అలుపెరుగని న్యాయం పోరాటం చేసి.. మళ్లీ అదే వేదికపై తాజాగా రజత పతకంతో మెరిసింది. దీంతో.. ఈ ఒడిశా క్రీడాకారిణికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. 1.5 కోట్ల నజరానాని ప్రకటించారు. భారీ అంచనాల మధ్య ఆసియా గేమ్స్లోకి అడుగుపెట్టిన ద్యుతిచంద్.. ఫైనల్లో కేవలం 0.02 సెకన్ల తేడాతో పసిడిని చేజార్చుకుంది. అయినప్పటికీ.. 100 మీటర్ల రేసులో ఓ భారత స్ప్రింటర్ ఆసియా గేమ్స్లో పతకం గెలవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి.
1998లో రచిత మిస్త్రీ చివరిగా కాంస్య పతకం గెలుపొందింది. అంతకముందు 1986లో పీటీ ఉష 100 మీటర్ల రేసులో రజతం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ద్యుతిచంద్ 11.32 సెకన్లలో 100 మీటర్ల రేసుని పూర్తిచేయగా.. బహ్రెయిన్ క్రీడాకారిణి ఒడియాంగ్ 11.30 సెకన్లతో పసిడి పతకాన్ని గెలుపొందింది.
మహిళల 400 మీటర్ల పరుగులో పోటీపడిన స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ రజత పతకం గెలుపొందగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహ్మద్ అనాస్ పురుషుల 400 మీటర్ల పరుగులో రజతాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్.. ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకూ భారత్ ఖాతాలో 36 పతకాలు చేరాయి. వాటిలో ఏడు స్వర్ణాలు, పది రజితాలు, 19 కాంస్యాలు ఉన్నాయి.