హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా గత ఆదివారంతో ముగిసిన ఆసియా గేమ్స్లో కాంస్య పతకం నెగ్గిన రెజ్లర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. తన సన్మాన కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోపాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరుపై ఆమె మండిపడింది.
స్వర్ణం గెలిచిన స్వప్న వాళ్ల ఊరికి కాంక్రీటు రోడ్డుని కూడా తీసుకొచ్చింది
ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించి ఉంటే కాంస్యం కాదు కదా స్వర్ణ పతకమే గెలిచేదాన్ని అని కేజ్రీవాల్ మొహం మీదే చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "నేను కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ గెలిస్తే ప్రభుత్వం నుంచి కావాల్సిన సంపూర్ణ మద్దతు ఇస్తామని మీరు నాకు మాట ఇచ్చారు. కానీ మద్దతు కాదు కదా కనీసం ఫోన్ కాల్స్ కూడా పట్టించుకోలేదు" అని కేజ్రీని దివ్య నిలదీసింది.
"మీరు ఇవాళ మమ్మల్ని సన్మానిస్తున్నారు. కానీ అథ్లెట్లుగా మారుదామని అనుకుంటున్న పేద పిల్లల గురించి ఓసారి ఆలోచించండి. ఇప్పుడు మెడల్స్ గెలిచామని మమ్మల్ని సన్మానిస్తున్నారు. మాకు మీ మద్దతు అవసరమైనప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. మీరు అప్పుడే మాకు సాయం చేసి ఉంటే.. మేం గోల్డ్ మెడల్ గెలిచేవాళ్లం" అని దివ్య తెలిపింది.
దీనిపై అదే సన్మాన కార్యక్రమంలో కేజ్రీవాల్ సైతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్లే తాము అనుకున్న పథకాలను సరిగా అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. "మేం చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నారు అని నువ్వు పేపర్లలో చదివే ఉంటావు. నువ్వు చెప్పేది నిజమే. చాలా మంది అథ్లెట్లు కూడా ఇదే అంటున్నారు. కానీ ఇప్పటివరకు మేం రూపొందించిన విధానాలన్నింటినీ పైస్థాయిలో ఉన్న వ్యక్తులు కావాలని పక్కబెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం" అని కేజ్రీవాల్ అన్నారు.
68 కేజీల రెజ్లింగ్ విభాగంలో దివ్య కక్రన్ తైవాన్కు చెందిన చెన్ వెన్లింగ్ను చిత్తుగా ఓడించి కాంస్య పతకం నెగ్గింది. ఆసియా గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఇచ్చే నగదు ప్రోత్సహాకాలను సైతం ఢిల్లీ ప్రభుత్వం పెంచింది. తొలుత స్వర్ణం పతకం సాధించిన క్రీడాకారులకు రూ.20 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.కోటిగా పెంచింది.
ఇక, రజత పతకం నెగ్గిన క్రీడాకారులకు ఇచ్చే రూ. 14 లక్షలను రూ. 75 లక్షలకు పెంచగా, కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు ఇచ్చే రూ. 10 లక్షలను రూ.50 లక్షలకు పెంచారు. గత ఆదివారంతో ముగిసి ఆసియా గేమ్స్లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 69 పతకాలను సాధించిన సంగతి తెలిసిందే.