హైదరాబాద్: ఆగస్టులో ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధిస్తామని భారత కబడ్డీ క్రీడాకారుడు మోనూ గోయత్ ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలో ఆసియా గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోనూ గోయత్ ఓ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో "ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధిస్తాం. వందశాతం పక్కా. కబడ్డీలో భారత విజయపరంపరను అక్కడే కొనసాగించి బంగారు పతకం కైవసం చేసుకుంటాం. కొరియా, ఇరాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి కొంత పోటీ ఎదురుకావొచ్చు" అని అన్నాడు.
"ఇటీవల ముగిసిన దుబాయ్లో జరిగిన కబడ్డీ మాస్టర్స్ ఫైనల్లో ఇరాన్ను ఓడించి కప్పు గెలిచాం. ఇరాన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అందుకే మనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రొకబడ్డీ లీగ్ వల్ల ఇరాన్ ఆటగాళ్లు భారత్ ఆటగాళ్లతో ఆడే అవకాశం దొరకుతోంది. అందుకే వారు మనకు గట్టి పోటీ ఇస్తున్నారు" అని మోనూ గోయత్ తెలిపాడు.
"ప్రస్తుతం మేము బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాం. మన జట్టులో కూడా మంచి రైడర్స్ ఉన్నారు. అలాగే డిఫెన్స్లో కూడా బలంగా ఉన్నాం. ఇవన్నీ కలిసొచ్చే అంశాలు" అని అన్నాడు. ఈ ఏడాది ప్రొకబడ్డీ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో మోనూ గోయత్ రికార్డు స్థాయిలో రూ.1.51కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.