భారత షూటర్ అపూర్వి చండేలా (26) ప్రపంచ నంబర్వన్గా నిలిచింది. ప్రపంచ షూటింగ్ ర్యాంకింగ్స్లో మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అంజుమ్ మౌద్గిల్ రెండో ర్యాంక్ను దక్కించుకుంది. అపూర్వి ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్ కోటా స్థానాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్కు చెందిన అపూర్వి గత ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్కప్లో స్వర్ణ పతకం గెలిచింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం.. 2018 ఆసియాడ్లో కాంస్య పతకాలు నెగ్గింది. ఇటీవల బీజింగ్ వేదికగా జరిగిన వరల్డ్కప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అంజుమ్ విజేతగా నిలిచింది.
మరోవైపు మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో మను భాకర్ 10వ ర్యాంక్.. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ర్యాంకింగ్స్లో దివ్యాంశ్ సింగ్ పన్వర్ నాలుగో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక 10 మీ. ఎయిర్ పిస్టల్లో అభిషేక్ వర్మ మూడో ర్యాంక్.. సౌరభ్ చౌధురి 6వ ర్యాంక్లో కొనసాగుతున్నారు. 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ కేటగిరీలో అనీష్ భన్వాలా 10వ ర్యాంక్లో నిలిచాడు.