
హరియాణాలోని పంచకులలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అమ్మాయిలు అదరగొట్టారు. ఈ పోటీల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన వెయిట్ లిఫ్టర్ పల్లవి ఏపీకి గోల్డ్ మెడల్ సాధించిపెట్టింది. బాలికల 64 కేజీల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణాన్ని సాధించింది. ఇక ఆమె స్నాచ్లో 84కిలోలు ఎత్తగా.. క్లీన్ అండ్ జెర్క్లో 104కిలోలు ఎత్తింది. మొత్తంగా 189కిలోలు లిఫ్ట్ చేసి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. ఇక బాలికల విభాగంలో 400మీటర్ల పరుగు పందెంలో పోలవరానికి చెందిన రజిత స్వర్ణ పతకం సాధించింది. ఆమె కేవలం 56.07సెకన్లలో గమ్యాన్ని ముద్దాడి పసిడి హారాన్ని పొందింది. ఇక అదే ఈవెంట్లో శ్రీకాకుళానికి చెందిన శిరీష 58సెకన్లలో పరుగు పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది.
వీరు ముగ్గురు ఏపీలోని పేద కుటుంబాల పిల్లలు కావడం గమనార్హం. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఇక ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో విజయం సాధించిన ఏపీ అమ్మాయిలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అద్భుతంగా రాణించి పతకాలు సాధించిన ఛాంపియన్లు రజిత, పల్లవి, శిరీషలకు నా అభినందనలు. ఉక్కు సంకల్పం కలిగిన ఈ బాలికలు ఏపీకి గర్వకారణం. వీరి విజయం.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీరు తమ విజయం ద్వారా ఎంతో మంది ఔత్సాహికులకు ప్రేరణగా నిలిచారు అంటూ సీఎం జగన్ ట్వీట్లో కొనియాడారు.