హైదరాబాద్: 14 సంవత్సరాల విరామం తర్వాత ఏథెన్స్ ఒలింపిక్స్లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచిన అంజూ బాబీ జార్జ్ అనే భారత క్రీడాకారిణి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ పట్టించుకోవట్లేదంటూ మండిపడుతోంది. రష్యా క్రీడాకారులు డోపింగ్ కు పాల్పడుతున్నారని తెలిసినా వాళ్లని ఆడనిస్తుండటం అన్యాయమంటూ అభిప్రాయపడింది. చాలా రోజుల క్రితం నుంచి రష్యన్లు డోపింగ్కు పాల్పడుతూ దొరికిపోతుండటంతో వారిపై మరోసారి విచారణ జరిపించాలని కోరింది.
గతంలో వారు సాధించిన పతకాలన్ని అలా సాధించినవేనేమో అనే అనుమానాన్ని బహిర్గతం చేసింది. ఫిబ్రవరి నెలలో ఈ విషయంపై స్పందించిన భారత్, కెనడా, ఆస్ట్రేలియాలు కలిసి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ సీఈఓకు లేఖ రాశారు. అందులో 2004లో జరిగిన వేసవి కాల క్రీడల గురించి మరో సారి విచారణ జరపాలని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ సమయంలో రష్యన్లు మూడు పతకాలు సాధించారు.
ఆ సీజన్లో లాంగ్ జంప్ మహిళా విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన క్రీడాకారిణి డోపింగ్కు పాల్పడిందని తేలింది. విషయం ఆలస్యంగా తెలియడంతో ఆమెను ఆ స్థానం నుంచి తొలగించారు. కానీ, తర్వాతి స్థానంలో ఉన్న అంజూ బాబీని ఈ విషయం ఒకింత నిరుత్సాహానికి గురి చేసింది. అంతేగాక ఈమెకు మందుగా ఉన్న ఇద్దరూ ఇలాంటి తప్పిదానికి పాల్పడినట్లు తేలి ఒలింపిక్ అంతర్జాతీయ కమిటీ, ఐఏఏఎఫ్ ఒప్పుకుంటే అంజూ బాబీకి వెండిపతకం వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఇదే విషయాన్ని అంజూ మీడియా సమావేశంలో పాల్గొని వెల్లడించింది. 'మనకు ఇప్పటికే మూడు అథ్లెటిక్ ఫెడరేషన్స్ ఉన్నాయి. రష్యన్లు డోపింగ్ పాల్పడుతున్నారని దాదాపు అన్ని ఫెడరేషన్స్కు తెలిసిన విషయమే. వీటి కోసం కాలిఫోర్నియాలో ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని కూడా వాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. బాల్కో అనే ల్యాబ్లో ఈ నిషేదిత ఉత్ప్రేరకాలు తయారుచేస్తుంటారు. ఆ సంస్థ నుంచే వాళ్లు వాటిని పొందుతున్నారు' అంటూ ఆమె పేర్కొంది.