
హైదరాబాద్: ఎయిర్ ఇండియా భారత క్రీడాకారుల పట్ల దారుణంగా వ్యవహరించింది. ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ ఆస్ట్రేలియా ఓపెన్లో భాగంగా జరగనున్న పోటీలకు భారత్ నుంచి 17మంది క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్బౌర్న్ వెళ్లేందుకు బయల్దేరిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల బృందం విమాన ప్రయాణం కోసం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. వారి టిక్కెట్లు విభిన్నమైన పీఎన్నార్లతో బుక్ చేసి ఉన్నాయని దాంతో పది మంది క్రీడాకారులు మాత్రమే ప్రయాణించనున్నట్లు భావించారు విమాన సిబ్బంది.

ఇలా మిగిలిన టిక్కెట్లు అన్నీ అమ్మేసి విమానం ఎక్కేందుకు కేవలం పది మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఫ్లైట్లో ఖాళీ లేదని మిగిలిన ఏడుగురు ప్లేయర్లను వదిలేసి వెళ్లిపోయింది మెల్బౌర్న్ వెళ్లాల్సిన విమానం. ఇక్కడే ఉండిపోయిన వారిలో గోల్డ్ కోస్ట్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు స్వర్ణంతో పాటు మరిన్ని పతకాలు సాధించి పెట్టిన మానికా బాత్రా కూడా ఉండిపోయారు.
ఈ వ్యవహారంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి రాజ్య వర్ధన్ సింగ్కు ట్వీట్ చేశారు. 'నేను.. నాతో పాటుగా కామన్వెల్త్ పతకదారు శరత్ కమల్, మోమా దాస్, మధురిక, హర్మీత్, సుతిర్త, సత్యన్లు మెల్బౌర్న్ విమానం ఏఐ 0308లో ప్రయాణించాల్సి ఉంది. ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో భాగంగా మంగళవారం పాల్గొనాల్సి ఉంది.
కానీ, కేవలం పది మందికి మాత్రమే టిక్కెట్లు బుక్ అయ్యాయని, మిగిలిన ఏడుగురిని విమాన సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. అన్ని టిక్కెట్లను 'బాల్మర్ లారీ'యే బుక్ చేశారు. మాకు సాయం చేయండి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన డైరక్టర్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ ఇండియా నీలమ్ కపూర్.. తర్వాతి రోజుకల్లా ప్లేయర్లంతా అక్కడికి చేరుకునే ఏర్పాటు చేస్తామని బదులుగా ట్వీట్ చేసింది. అప్పటి వరకూ హోటల్లో వసతి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వారికి ఆదివారం రాత్రి విమానంలో టిక్కెట్లు దొరికినట్లు నిర్దారించి మరో ట్వీట్ చేశారు.