
హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. లీగ్లో భాగంగా టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 37-29తో తెలుగు టైటాన్స్ ఓడిపోయింది. ప్రస్తుతం పుణె అంచె పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
దబాంగ్ డిల్లీకి ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఈ సీజన్లో తెలుగు జట్టుకు ఇది తొమ్మిదో అపజయం. డిల్లీ ఆటగాళ్లలో నవీన్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఆటగాడు సిద్ధార్ద్ దేశాయ్ మరోసారి సూపర్ 10తో మెరిశాడు. తెలుగు టైటాన్స్ అబోజర్ మొహజర్మిగానీ ఈ మ్యాచ్తో 3 పాయింట్లు సాధించడంతో 150 ట్యాకిల్ పాయింట్ క్లబ్లో చేరాడు.
సిద్ధార్థ్ రాణించడంతో మ్యాచ్ను టైటాన్స్ మెరుగ్గానే ఆరంభించింది. 4-2తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. రాకేశ్ (5), అబోజర్ సూపర్ ట్యాకిళ్లతో జట్టు ఓ దశలో 11-7తో నిలిచింది. కానీ అద్భుత ఫామ్లో ఉన్న ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ (12) మరోసారి సూపర్ 10తో చెలరేగాడు.
దీంతో తెలుగు టైటాన్స్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 15-18తో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో స్టార్ రైడర్ సిద్ధార్థ్ మరింత దూకుడుగా ఆడినప్పటికీ అతడికి సహకరించే వాళ్లు కరవయ్యారు.
కాగా, తెలుగు టైటాన్స్ రైడింగ్లో 19, ట్యాకిల్స్లో 9, ఎక్స్ట్రా రూపంలో ఒక పాయింట్ సాధించింది.రెండు నిమిషాల ఆట మిగిలి ఉందనగా ఆ జట్టు 27-37తో నిలిచి మరో ఓటమిని ఖాయం చేసుకుంది.
తాజా విజయంతో దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లు ఆడి 13 మ్యాచ్ల్లో విజయం సాధించి 69 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక, తెలుగు టైటాన్స్ 16 మ్యాచ్ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఆఖరు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.