ముంబై: రైడింగ్, డిఫెన్స్లో మెరుగైన ప్రదర్శన చేసిన పట్నా పైరేట్స్... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన జోన్-బి మ్యాచ్లో పైరేట్స్ 50-30తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. పట్నా తరఫున 'డుబ్కీ' కింగ్ ప్రదీప్ నర్వాల్ 11, దీపక్ నర్వాల్ 13 పాయింట్లతో చెలరేగారు. జైదీప్ 5, వికాస్ 3, రవీందర్ 3 పాయింట్లతో రాణించారు.
బెంగాల్కు మణిందర్ 6, రన్ సింగ్ 3, బల్దేవ్ సింగ్ 3, ఆదర్శ్ 3 పాయింట్లు అందించారు. విరామ సమయానికి పట్నా 22-14తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ద్వితీయార్ధంలో పైరేట్స్ ఆటగాళ్లు మరింత విజృంభించారు. రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. దీంతో బంగాల్ 14 పాయింట్లపై ఉండగానే.. పట్నా పాయింట్లు 32కు చేరుకున్నాయి.
ఆరంభం నుంచే రైడింగ్లో చెలరేగిన పట్నా.. ప్రత్యర్థిని మూడుసార్లు ఆలౌట్ చేసి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు బెంగాల్కు ఏదీ కలిసిరాలేదు. ఆడిన తొమ్మిది గేమ్ల్లో ఇది మూడో ఓటమి. దీపక్ రైడింగ్లో రాణించినా.. ట్యాకిలింగ్లో మిగతా ఆటగాళ్లు నిరాశపర్చారు. ఈ మ్యాచ్ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్నేహితులతో కలిసి వీక్షించారు.
జోన్-ఎ మ్యాచ్లో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ 38-36 స్వల్ప తేడాతో యు ముంబాపై గట్టెక్కింది. రైడింగ్లో అదరగొట్టిన సచిన్ 9 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పర్వేశ్ 4, సునీల్ 3, రోహిత్ 2 పాయింట్లతో చక్కని సహకారాన్ని అందించారు. యు ముంబా తరఫున సిద్ధార్థ్ 13 పాయింట్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది. రోహిత్ బలియాన్ 7, ఫజల్ 3, రోహిత్ రానా 2 పాయింట్లు సాధించారు.