
కోల్కతా: సోమవారం జరిగిన మ్యాచ్లో స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ 26 పాయింట్లతో విశ్వరూపం ప్రదర్శించడంతో ప్రొ కబడ్డీ లీగ్లో పాట్నా పైరేట్స్ 51-25తో తమిళ్ తలైవాస్పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పట్నా సూపర్ విక్టరీని నమోదు చేసింది. తలైవాస్ తరఫున రాహుల్ చౌదరి (5 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. అజిత్ కుమార్ (10 పాయింట్లు) సూపర్-10 సాధించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే పర్దీప్ రెచ్చిపోయాడు. పర్దీప్ వరుసగా పాయింట్లు తేవడంతో తలైవాస్ పూర్తిగా వెనుకబడిపోయింది. తొమ్మిదవ నిమిషంలో తలైవాస్ను మొదటి ఆల్ ఔట్ చేసిన పట్నా 11-4 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పర్దీప్ దూకుడు కొనసాగిస్తూ.. ప్రో కబడ్డీలో 1000 పాయింట్లకు చేరుకున్నాడు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి పట్నా 18-13తో నిలిచింది. పర్దీప్ ఒక్కడే 12 పాయింట్లు చేసాడు.
విరామం అనంతరం తలైవాస్ మరోసారి ఆలౌట్ అయింది. దీంతో పట్నా తన ఆధిక్యాన్ని 25-13కు పెంచుకుంది. ఈ సమయంలో పర్దీప్ రెండు సూపర్ రైడ్లు చేయడంతో తలైవాస్ మూడోసారి ఆలౌట్ అయింది. పర్దీప్ దూకుడు ముందు తైలవాస్ నిలవలేకపోయింది. ఆట ఆరు నిమిషాలు మిగిలి ఉండగానే తమిళ తలైవాస్ నాలుగోసారి ఆలౌట్ అయింది. మరోవైపు పర్దీప్ జోరు కొనసాగించడంతో.. చివరి నిమిషంలో పట్నా 50 పాయింట్ల మార్క్ అందుకుంది. దీంతో ఈ సీజన్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టుగా పట్నా నిలిచింది.
రైడింగ్లో కాస్త ఫర్వాలేదనిపించిన తలైవాస్.. ట్యాక్లింగ్లో ఘోరంగా విఫలమైంది. పర్దీప్ వన్ మ్యాన్ షోతో రెచ్చిపోవడంతో.. తంబీలను నాలుగు సార్లు ఆలౌట్ చేసిన పాట్నా అలవోకగా మ్యాచ్ను సొంతం చేసుకుంది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో పర్దీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ.