
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ సీజన్-7లో హరియాణా స్టీలర్స్ దూసుకెళుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో హరియాణా 41-25 తేడాతో గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ను ఓడించింది. దీంతో హరియాణా విజయాల హ్యాట్రిక్ను నమోదు చేసింది. హరియాణా ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటారు. రైడింగ్లో వికాస్ ఖండోలా (7), ప్రశాంత్ కుమార్ రాయ్ (8).. ట్యాక్లింగ్లో రవి కుమార్ (6) రాణించి హరియాణాకు అద్భుత విజయాన్ని అందించారు. వినయ్ (7) ఆల్రౌండ్ నైపుణ్యంతో మెరిశాడు.
మ్యాచ్ ప్రారంభంలో 4-0తో ఫార్చున్జెయింట్స్ దూసుకుపోయింది. అయితే పుంజుకున్న హరియాణా ఆధిపత్యం ప్రదర్శించింది. వికాస్, ప్రశాంత్ చెలరేగడంతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఆ జట్టు 15-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆలౌట్ అనంతరం గుజరాత్ పాయింట్ సాధించినా.. ప్రత్యర్థి రైడర్ వికాస్ సూపర్ రైడ్ సాధించడంతో హరియాణా తొలి అర్ధభాగాన్ని 20-11తో ముగించింది. మ్యాచ్ ప్రారంభంలో 4-0తో ఫార్చున్జెయింట్స్ నిలిచినా.. ఆ తర్వాత ఒక్కసారీ ఆధిక్యంలోకి రాలేకపోయారు.
విరామం తర్వాత కూడా హరియాణా అదే జోరు కొనసాగించింది. మరో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుని ఆధిక్యాన్ని పెంచుకుంది. హరియాణా రైడర్లు రెచ్చిపోవడంతో గుజరాత్ ఆలౌట్ అయ్యే అంచున నిలబడినా.. మోర్ జిబి చేసిన సూపర్ టాకిల్ అది జరగకుండా చేసాడు. కొద్దిసేపటికే 27-14తో హరియాణా నిలిచింది. ఈ సమయంలో గుజరాత్ నిలబడే ప్రయత్నం చేసినా.. హరియాణా అవకాశం అవ్వలేదు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదగొట్టిన హరియాణా పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.