
అహ్మదాబాద్: గుజరాత్పై విజయంతో గాడిలో పడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బంగాల్ వారియర్స్తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ను 29-29తో టై చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కిది రెండో టై. చివరి రైడ్లో సురాజ్ దేశాయ్ పాయింట్ తెస్తే టైటాన్స్ గెలిచేదే. కానీ.. రక్షణాత్మక ధోరణిలో ఆడిన కారణంగా చివరకు టైతోనే సరిపెట్టుకుంది. టైటాన్స్ తరపున రైడింగ్లో సూరజ్ దేశాయ్ (7), ట్యాక్లింగ్లో ఫర్హద్ మిలాఘర్దాన్ (3) పర్వాలేదనిపించారు. 12 సార్లు రైడ్కు వెళ్లిన సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లే తెచ్చి మరోసారి నిరాశ పరిచాడు. బంగాల్ జట్టులో మహమ్మద్ నబిబక్ష్ (8) ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు.
ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. సిద్ధార్థ్, ఫర్హద్ మెరవడంతో తొలి ఆరు నిమిషాలు ముగిసేసరికి టైటాన్స్ 5-3తో ఆధిక్యం సంపాదించింది. మణిందర్ (5) రాణించడంతో బంగాల్ 7-7తో స్కోరు సమం చేసింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13-11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17-12తో ఆధిక్యంలోకే వెళ్ళింది. ఈ సమయంలో డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు కారణంగా బంగాల్ పుంజుకుంది. స్కోర్లు సమం అవుతూ మ్యాచ్ సాగింది. చివరికి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
మరో మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు బుల్స్కు షాక్ తగిలింది. బుల్స్ 33-35 తేడాతో యూపీ యోధ చేతిలో ఓడింది. బుల్స్కు వరుసగా ఇది రెండో పరాజయం. యూపీకి ఈ సీజన్లో రెండో విజయం. రైడింగ్, ట్యాక్లింగ్లో రాణించిన పవన్ సెరావత్ (15) ఆట చివరలో విఫలమవడంతో బుల్స్ ఓడిపోయింది. శ్రీకాంత్ జాదవ్ (9), మోను గోయత్ (8) యూపీని విజయతీరాలకు చేర్చారు. ప్రొ కబడ్డీ లీగ్లో మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్.. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.