
బెంగళూరు: కీలక సమయంలో రైడర్ అభిషేక్ సింగ్ అద్భుత పోరాటం చేయడంతో యు ముంబా డ్రాతో మ్యాచును ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్లో భాగంగా గురువారం పుణెరీ పల్టన్, యు ముంబా మధ్య జరిగిన మ్యాచ్ 33-33 తో టై గా ముగిసింది. చివరి ఐదు నిమిషాల్లో ఆరు పాయింట్లు వెనుకబడినా అభిషేక్ (11 పాయింట్లు) సత్తా చాటడంతో చివరకు యు ముంబా టై చేసుకుంది. పుణె ఆల్రౌండర్ మంజీత్ 11 పాయింట్లతో.. పంకజ్ (5 పాయింట్లు)తో రాణించాడు.
ఆరంభంలో ఇరు జట్లూ డిఫెన్స్కే ప్రాధాన్యం ఇవ్వడంతో పాయింట్ల రాక కష్టమైంది. అనంతరం పాయింట్ల కోసం పోటీపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. అయితే 8వ నిమిషంలో పల్టన్ను ఆలౌట్ చేసిన ముంబా 11-5తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కానీ.. ఈ సమయంలో మంజీత్ రెచ్చిపోయాడు. అనంతరం పల్టన్ పట్టువదలకుండా ప్రయత్నించడంతో తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 16-12తో నిలిచింది.
రెండో సగం ఆరంభమైన 4నిమిషాలకే ముంబాను ఆలౌట్ చేసిన పుణె 20-20తో స్కోరు సమం చేసింది. ఆపై పూణే తరపున ఆటగాళ్లు సత్తా చాటడంతో వరుస పాయింట్లు వచ్చాయి. ఇదే ఊపులో చివరి ఏడు నిమిషాల్లో ముంబాను మరోసారి ఆలౌట్ చేసిన పుణె 32-26తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. అద్భుతంగా పోరాడిన ముంబా చివరకు స్కోరును సమం చేసింది. ఆఖరి రైడ్కు వచ్చిన పుణె ఆటగాడు తజీక్ విఫలమవడం.. పుణెను దెబ్బ తీసింది. బెంగళూరు అంచె పోటీల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్.. పాట్నా పైరేట్స్తో యూపీ యోధా తలపడనున్నాయి.