
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ రాకతో భారత కబడ్డీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లో భాగంగా శనివారం యు ముంబా-పుణెరి పల్టన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కి ప్రత్యేక అతిథిగా విరాట్ కోహ్లీ హజరయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ సందర్భంగా కబడ్డీ జట్టుగా ఏ క్రికెటర్లను ఎంపిక చేస్తారనే ప్రశ్నకు కోహ్లీ సమాధానమిచ్చాడు. తమిళ్ తలైవాస్ ఆటగాడు రాహుల్ చౌదరి ఆట తనకి ఎంతో ఇష్టమని చెప్పిన విరాట్ కోహ్లీ.... రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్లో తనని, ధోనీని చూసుకుంటున్నట్లు ఉంటుందని చెప్పాడు.
"కబడ్డీ ఆడాలంటే ఎంతో బలాన్ని కలిగి ఉండాలి. ధోనీ, జడేజా, ఉమేశ్ యాదవ్ దీనికి సరిపోతారు. రిషబ్ పంత్, బుమ్రాని కూడా జట్టులోకి తీసుకోవచ్చు. బుమ్రా ప్రత్యర్థులను సులువుగా తాకి రాగలడు. కబడ్డీ జట్టులో నా పేరు నేను చెప్పుకోలేను. ఎందుకంటే వారందరూ చాలా బలమైన అథ్లెట్స్. కేఎల్ రాహుల్తో పాటు చివరిగా నేను తుదిజట్టులో చోటు కల్పించుకుంటా" అని కోహ్లీ చెప్పాడు.
అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ప్రొ కబడ్డీ లీగ్ రాకతో కబడ్డీ మన దేశంలో క్రీడా సంస్కృతిలో దూసుకుపోతుంది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ప్రస్తుతం ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండడం ప్రత్యేక అనుభూతినిస్తోంది" అని అన్నాడు.
"ప్రపంచంలోనే అత్యుత్తమ కబడ్డీ జట్టు మనదే కావడం ఎంతో గర్వంగా ఉంది. వివిధ దేశాల నుంచి ఆటగాళ్లు వచ్చి ఈ లీగ్లో పాల్గొంటున్నారంటే ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) ఎంతగా వృద్ధి చెందుతుందో అర్థమవుతోంది. కబడ్డీ యొక్క స్థాయి పెరిగిందని చెప్పేందుకు పికేఎల్ నిదర్శనం. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి భారత ఆటగాళ్ల అంకితభావం, ఫిట్నెస్ కారణం" అని కోహ్లీ తెలిపాడు.
కాగా, యు ముంబా 33-23తో పుణెరి పల్టన్పై విజయం సాధించింది. కెప్టెన్ ఫజల్ (4), సందీప్ నర్వాల్ (4), సురీందర్ సింగ్ (4)లు డిఫెన్స్లో అద్భుత ప్రదర్శన చేయగా... రైడింగ్లో అభిషేక్ సింగ్ 5 పాయింట్లు సాధించాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడ్డారు.
2-2తో ఉన్న సమయంలో శుభమ్ షిండే పాయింట్ తేవడంతో పుణె 3-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత డాంగ్ కాంగ్ లి, సందీప్ నర్వాల్ను పట్టేయడంతో పుణెరి పల్టన్ 5-2తో ముందంజ వేసింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి ముంబా 5-5తో స్కోరు సమం చేసింది.
తొలి 12 నిమిషాల ఆట ముగిసే సరికి రెండు జట్లు 7-7తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత కీలక సమయంలో పుంజుకొన్న ముంబా 11-9తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ముంబా డిఫెండర్లు గొప్పగా పుంజుకున్నారు. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి జట్టుకు 15-10తో ఆధిక్యాన్ని అందించారు.
ఆ తర్వాత ముంబా రైడర్లు వరుసగా పాయింట్లు తేవడంతో 21-12తో నిలిచింది. చివరి తొమ్మిది నిమిషాల ఆట మిగిలి ఉందనగా మరోసారి పుణెరిని ఆలౌట్ చేసిన ముంబా 27-17తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ముంబా 33-23తో మ్యాచ్ను నెగ్గింది.