టోక్యో: జపాన్లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్లో ఏడో రోజు భారత్ వరుస విజయాలను అందుకుంటోంది. స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ 1/16 రౌండ్లో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిచ్ఫెల్ట్ను వరుస సెట్ల తేడాతో ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టారు. భారత్ పతకం అందుకుని తీరుతుందని ఆశించే కేటగిరీ ఇది. బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే హాకీ ఇండియా తీపి కబురును వినిపించింది. గ్రూప్ దశలో మూడో విజయనాన్ని అందుకుంది.
ఎదురు లేని పీవీ సింధు: ఇంకో క్లీన్ విక్టరీ: ప్రత్యర్థుల మెడలు వంచి మెడల్ దిశగా
ఆస్ట్రేలియాపై 1-7 గోల్స్ తేడాతో ఎదుర్కొన్న అవమానకర ఓటమి నుంచి తేరుకున్న తరువా భారత హాకీ ప్లేయర్లు వరుసగా అందుకున్న రెండో విజయం ఇది. 27వ తేదీన స్పెయిన్ను వణికించిన హాకీ ఆటగాళ్లు.. ఈ సారి అర్జెంటీనాపై తడాఖా చూపారు. 3-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ తన రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఓడించింది హాకీ ఇండియా. 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్లో ఘోరంగా ఓటమి పాలైంది. 1-7 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది.
మూడో మ్యాచ్లో స్పెయిన్ను 3-0 తేడాతో ఓడించింది. తాజాగా అర్జెంటీనాపై 3-1 గోల్స్ తేడాతో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ మూడో క్వార్టర్లో భారత్ తొలి గోల్ సాధించింది. 1-0 ఆధిక్యాన్ని కనపరిచింది. భారత్ తరఫున వరుణ్ కుమార్ తొలి గోల్ సాధించాడు. ఇది అతనికి తొలి ఒలింపిక్ గోల్. ఆ తరువాత నాలుగో క్వార్టర్లో అర్జెంటీనా చేసింది. ఆధిక్యాన్ని 1-1 తేడాతో సమం చేసింది. ఆ కొద్దిసేపటికే భారత్ వరుసగా రెండు గోల్స్ను అందుకుంది. స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. దీనితో భారత్ 3-1 గోల్స్ తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత అర్జెంటీనా పదేపదే గోల్ పోస్ట్పై దాడులు చేసినప్పటికీ- కీపర్ శ్రీజేష్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు.