పంజాబ్: టోక్యో ఒలింపిక్స్ 2020లో అద్భుత విజయం సాధించిన టీమిండియా హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత హాకీ జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. భారత హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని గుర్మిత్ సింగ్ సోధి ట్వీట్ చేశారు.
'భారత హాకీలో ఇదొక మరిచిపోలేని రోజు. పంజాబ్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఆటగాడికి కోటి రూపాయలు నజరానా ప్రకటించడం చాలా చాలా ఆనందంగా ఉంది. పతకంతో ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు తిరిగొస్తారా అని ఎదురుచూస్తున్నాం' అని పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మీత్ సింగ్ ట్వీట్ చేశారు. భారత హాకీ జట్టులో 8 మంది పంజాబీలు ఉన్నారు. మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, రూపిందర్పాల్ సింగ్, హార్దిక్ సింగ్, శంషీర్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్ పంజాబ్కు చెందినవారే. స్వర్ణం గెలిస్తే ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు అందజేస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇప్పుడు కాంస్యం తేవడంతో కోటి రూపాయలను ప్రకటించింది.
భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రతిఒక్కరిలో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపక్స్ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్ భారత్ 5-4 తేడాతో విజయం సాదించింది. దీంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్ పతకాన్ని సాధించిన ఘనతను మన్ప్రీత్ సింగ్ సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అనుకోకుండా హాకీని కెరీర్గా ఎంచుకున్నాడు.. భారత్కు మెడల్ తెచ్చాడు! శ్రీజేష్ అసలు కథ ఇదే!!
తమ బిడ్డలు సాధించిన విజయాన్ని చూసి హాకీ ఆటగాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడుతున్నారు. ఇంటి వద్ద పండగలా చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి ఇండియాకు తప్పకుండా పతకం గెలుస్తామని చెప్పాడట. 'మన్ప్రీత్ ఉదయాన్నే ఫోన్ చేశాడు. జట్టు పతకం గెలుస్తుందని చెప్పాడు' అని అతడి తల్లి మంజీత్ కౌర్ తెలిపారు. ఇక మ్యాచ్ ముగిశాక ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లూ తన కొడుకు పడ్డ కష్టాలకు తగిన ఫలితం వచ్చిందన్నారు.
మ్యాచ్ గెలిచాక కుటుంబ సభ్యులు భారత హాకీ ఆటగాళ్లకు వీడియో కాల్ చేశారు. భాంగ్రా నృత్యాలు చేస్తూ వారితో తమ ఆనందం పంచుకున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. కురుక్షేత్రలోని సురేందర్ కుమార్ తల్లి అతడికి వీడియో కాల్ చేసి భావోద్వేగం చెందారు. అమృతసర్లోని గుర్జంత్ సింగ్, శంషీర్ కుటుంబీకులు ఆనందంలో మునిగి తేలారు. బెల్జియంతో సెమీస్లో ఓడినప్పుడు తాము నిరాశపడ్డామని రూపిందర్ తల్లి తెలిపారు. జర్మనీపై గెలిచి కాంస్యం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు.