న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ (2020)కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తోంది. డైట్ ఫాలో కావడంతో క్రీడాకారిణిలు తమకిష్టమైన స్వీట్లు, చాక్లెట్లు, మసాలాలకు దూరం కావాల్సి వచ్చింది. జట్టు సైంటిఫిక్ అడ్వైజర్ వేన్ లాంబర్డ్ క్రీడాకారిణిలు తీసుకునే ఆహారంలో కఠినమైన ఆంక్షలు విధించారు. టోక్యో క్వాలిఫయింగ్ పోటీలు ముగిసేదాకా స్వీట్లు, మసాలాలు వంటి వంటకాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
నవంబరులో జరిగే టోక్యో ఒలింపిక్స్ తుది అర్హత టోర్నీకి బెంగళూరు శిబిరంలో జట్టు కఠోర సాధన చేస్తోంది. జట్టు క్రీడాకారిణులంతా పూర్తి ఫిట్నె్సతో ఉన్నారని కెప్టెన్ రాణి రాంపాల్ తెలిపింది. దీనికి కారణం లొంబార్డ్ అని ప్రశంశించింది. తాజాగా రాణి రాంపాల్ మాట్లాడుతూ... ' మెరుగైన ఫిట్నెస్ ఉన్న అత్యుత్తమ భారత మహిళల హాకీ జట్టు ఇదే. జట్టులోని ప్రతీ క్రీడాకారిణిపై వేన్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండేందుకు కష్టపడుతున్నారు' అని రాంపాల్ తెలిపింది.
'వేన్ లాంబర్డ్ సూచించిన ఆహార ప్రణాళికను పాటిస్తున్నాం. స్వీట్లు, చాక్లెట్లు, మసాలా, నూనె పదార్థాలు తినటం పూర్తిగా మానేశాం. అవసరమైన సమతుల, పోషకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. డైట్ పాటిస్తున్నాం కాబట్టే మాలో ప్రతి ఒక్కరు అసాధారణ ఫిట్నెస్తో ఉన్నారు' అని కెప్టెన్ పేర్కొంది.
1980 ఒలింపిక్స్లో మొదటిసారి మహిళల హాకీని ప్రవేశపెట్టారు. ఆ ఏడాది భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 36 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2016 రియో ఒలింపిక్స్కు అర్హత సాధించినా.. 12వ స్థానంలో నిలిచింది. నవంబర్లో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించాలని భారత జట్టు భావిస్తున్నది. ఇటీవల జపాన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ సిరీస్లో టైటిల్ నెగ్గింది. ఈ నేపథ్యంలో టోక్యో బెర్తు సాధిస్తుందనే నమ్మకం ఉంది.