మైదానంలో పిడిగుద్దుల వర్షం:
మ్యాచ్ జరుగుతుండగా ఇరు జట్ల మధ్య ఓ చిన్న వివాదం తలెత్తింది. వివాదం కాస్త ముదరడంతో రెండు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇది చాలనట్టు చేతిలో ఉన్న హాకీ కర్రలతో ఆటగలు మైదానంలోనే కొట్టుకున్నారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వివాదంపై హాకీ ఇండియా రంగంలోకిదిగింది.
11 మంది ఆటగాళ్లపై వేటు:
టోర్నమెంట్ నిర్వాహకుల నుండి హాకీ ఇండియా వివరణాత్మక నివేదిక కోరింది. నివేదికలు, వీడియో సాక్ష్యాలను హాకీ ఇండియా ఉపాధ్యక్షుడు భోలానాథ్ సింగ్ నేతృత్వంలోని క్రమశిక్షణ సంఘం పరిశీలించింది. రెండు జట్లకు సంబంధించిన మొత్తం 11 మంది ఆటగాళ్లపై వేటు వేసింది. ఆటగాళ్ల పొరపాటు స్థాయిని బట్టి 12-18, 6-12 నెలలు సస్పెండ్ చేయాలని క్రమశిక్షణ సంఘం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
మేనేజర్పై 18 నెలల సస్పెన్షన్:
పంజాబ్ సాయుధ పోలీసుల జట్టుకు చెందిన హర్దీప్ సింగ్, జస్కరణ్ సింగ్కు 18 నెలలు.. దూపీందర్దీప్ సింగ్, జగ్మీత్ సింగ్, సుఖ్ప్రీత్ సింగ్, సర్వజిత్ సింగ్, బల్విందర్ సింగ్కు 12 నెలల సస్పెన్షన్ విధించారు. 2019 డిసెంబర్ 11 నుంచి వీరందరికి శిక్ష అమలవుతుందని భారత హాకీ ఇండియా క్రమశిక్షణ సంఘం తెలిపింది. పోలీస్ జట్టు మేనేజర్ అమిత్ సంధుపై 18 నెలల సస్పెన్షన్ వేటు పడింది.
జట్లపైనా వేటు:
పంజాబ్ బ్యాంకు ఆటగాళ్లు సుఖ్జీత్ సింగ్, గుర్సిమ్రన్ సింగ్, సుమిత్ టప్పొ (12 నెలలు), జస్బీర్ సింగ్ (6 నెలలు), మేనేజర్ సుశీల్ కుమార్ దూబె (6 నెలలు)ను హాకీ ఇండియా సస్పెండ్ చేసింది. ఆటగాళ్లపైనే కాకుండా జట్లపైనా వేటు పడింది. పంజాబ్ పోలీసుల బృందాన్ని మూడు నెలల సస్పెన్షన్ కింద ఉంచారు. అంతేకాదు అఖిల భారత టోర్నమెంట్లలో దేనిలోనైనా ఆడటానికి అర్హత కోల్పోయారు. 2020, 10 మార్చి నుండి 2020, 9 జూన్ వరకు సస్పెన్షన్ గడువు ఉంది.