తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్
వరల్డ్కప్ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో తమ(5) కంటే తక్కువ ర్యాంక్(15)లో ఉన్న దక్షిణాఫ్రికాపై విజయంతో బోణీ చేయాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్న టీమిండియా భారీ తేడాతో విజయంతో పాయింట్ల ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా గోల్స్ చేసేందుకు మెరుగైన ప్రణాళికతో సిద్ధమైంది.
గ్రూపు-సీలో టాప్తో క్వార్టర్స్ బెర్తు దక్కించుకోవాలని
ఆ తర్వాత జరిగే బెల్జియం, కెనడా జట్లపై కూడా విజయం సాధించి... మూడు మ్యాచ్ల్లో విజయాలతో గ్రూపు-సీలో టాప్తో క్వార్టర్స్ బెర్తు దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. క్రాస్ ఓవర్ మ్యాచ్ లక్ష్యంగా కాకుండా క్వార్టర్లో ప్రవేశంగానే ఆడుతామని కెప్టెన్ మన్ప్రీత్సింగ్ ఇప్పటికే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టు ఒత్తిడితోనే బరిలోకి దిగనుంది.
కోచ్ హరేంద్ర సింగ్కు కూడా
కోచ్ హరేంద్ర సింగ్కు కూడా ఇది కీలక టోర్నీ కానుంది. ఒకవేళ జట్టు విఫలమైతే అతడిపై వేటు తప్పదు. రెండేళ్ల క్రితం జూనియర్ జట్టును విశ్వ విజేతగా నిలిపిన అనుభవం ఉన్న హరేంద్ర సింగ్ ఈసారి సీనియర్ టోర్నీలో సైతం సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆ జట్టులో ఆడిన ఏడుగురు ఆటగాళ్లను సీనియర్ జట్టులో ఆడిస్తున్నాడు. దీంతో యువ, సీనియర్ మిళితమైన జట్టుతో భారత్ బరిలోకి దిగుతోంది.
జట్టు విజయాలు యువ ఆటగాళ్లపైనే ఆధారపడి
కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, గోల్కీపర్ శ్రీజేష్, ఆకాశ్దీప్ సింగ్, బీరేంద్ర లక్రా ఆటతీరుపై జట్టు విజయాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తం 18 మందితో ఎంపిక చేసిన జట్టులో ఏడుగురు యువకులే కావడం విశేషం. 19 ఏళ్ల దిల్ప్రీత్ సింగ్తో పాటు హార్దిక్ సింగ్ ఈ టోర్నీ ద్వారా అరంగేట్రం చేయనున్నారు. అయితే డ్రాగ్ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ను జట్టులో నుంచి తప్పించగా స్ట్రయికర్ ఎస్వీ సునీల్ గాయం కారణంగా చోటు దక్కలేదు.
అయితే ఆర్థిక సమస్యల కారణంగా ప్రపంచకప్ సన్నాహాల కోసం తమ సొంత జేబుల నుంచి ఖర్చు చేసిన దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్ ఆరు మ్యాచ్ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్లు ‘డ్రా'గా ముగిశాయి. భారత్పై దక్షిణాఫ్రికా నమోదు చేసిన ఏకైక విజయం 2012 లండన్ ఒలింపిక్స్లో రావడం గమనార్హం.
43 ఏళ్ల క్రితం తొలి వరల్డ్కప్ను గెలుచుకున్న భారత్
ఎనిమిది సార్లు ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన భారత జట్టు ఒకే ఒకసారి 43 ఏళ్ల క్రితం తొలి వరల్డ్కప్ను గెలుచుకుంది. 1975లో మలేషియాలో జరిగిన టోర్నీలో అజిత్పాల్ సింగ్ సారథ్యంలోని టీమ్ఇండియా తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో దాయాది పాకిస్థాన్పై అద్భుత విజయంతో కప్ను ఒడిసిపట్టుకుంది. అంతకుముందు జరిగిన 1971, 1973 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ వరుసగా కాంస్య, రజత పతకాలు దక్కించకుంది.
ఐదోస్థానంలో నిలువడం ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన
కానీ ఆ తర్వాత కాలంలో భారత జట్టు ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. ప్రపంచ హాకీ వరల్డ్కప్లో గత నాలుగు దశాబ్దాలుగా నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రేలియా జట్లు హాకీలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. 1994 సిడ్నీలో జరిగిన టోర్నీలో ఐదోస్థానంలో నిలువడం ఇప్పటివరకు మన అత్యుత్తమ ప్రదర్శన. అది కూడా 1982 బొంబాయిలో జరిగిన టోర్నీలో వచ్చింది. ప్రస్తుతం భారత హాకీ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉంది. కనీసం సెమీస్ బెర్త్నైనా దక్కించుకోవాలనుకుంటోంది.
మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిన ఆతిథ్య జట్టు
మరోవైపు హాకీ వరల్డ్ కప్లో ఓ విచిత్రమైన రికార్డు ఆతిథ్య జట్టును వెంటాడుతోంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఒక్క జట్టు కూడా ఇప్పటిదాకా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. దారుణ ఆటతీరుతో ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లోనే సంతృప్తిపడాల్సి వచ్చింది. ఇంతకుముందు తొమ్మిది ఆతిథ్య దేశాల జట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు భారత్ ఆ చెత్త రికార్డును తిరగరాస్తుందా? లేదో చూడాలి.
సాయంత్రం 7.00 నుంచి స్టార్స్పోర్ట్స్లో