అంబరాన్నంటిన హాకీ ప్రపంచ కప్ సంబరాలు(వీడియో)


భువనేశ్వర్: హాకీ ప్రపంచకప్ టోర్నీకి భారత్ అదిరిపోయే రీతిలో ఆతిథ్యమిస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఒడిశా ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ప్రపంచకప్ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తరలిరానున్న పర్యాటకులను కట్టిపడేసేలా దాదాపు 100 కోట్ల వ్యయంతో నగరం మొత్తాన్ని జిగేల్మనే రీతిలో సుందరీకరించింది. బాలీవుడ్ కింగ్ఖాన్ షారుఖ్ఖాన్ ఎంట్రీతో మొదలైన సంబురాలు రెహమాన్ హిట్ పాటలతో మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న కళింగ స్టేడియానికి సరికొత్త హంగులు అద్దాయి.
బాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ వందలాది మంది చిన్నారులతో కలిసి చేసిన మదర్ ఎర్త్ అందరినీ ఆలోచనలో పడేసింది. మొత్తంగా గతానికి భిన్నంగా 14వ హాకీ ప్రపంచకప్ సంబురాలు అంబరాన్నంటాయి. మొత్తం 16 జట్ల సమాహారంతో 18 రోజుల పాటు జరగబోతున్న హాకీ వరల్డ్కప్ ఆరంభ వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. మ్యాచ్లకు వేదికైన కళింగ స్టేడియం సుందరంగా ముస్తాబైంది. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు దాదాపు 3 గంటల పాటు సాగాయి.
1982, 2010ల తర్వాత ఇదే మూడో సారి:
హాకీ ప్రపంచకప్కి భారత్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1982, 2010లోనూ ఈ మెగా టోర్నీని భారత్లో నిర్వహించారు. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ హాకీ ప్రపంచ కప్లో మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. పూల్-సిలో ఉన్న భారత్ బుధవారం తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో ఢీకొననుంది. 1971 నుంచి ఈ ప్రపంచకప్ జరుగుతుండగా.. 1975లో భారత్ విజేతగా నిలిచింది.
16 దేశాలకు చెందిన కెప్టెన్లతో ఒడిశా సీఎం
నాడు జట్టును విజేతగా నిలిపిన దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆరంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్టేజిపైన 16 దేశాలకు చెందిన కెప్టెన్లతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు నరిందర్ బాత్రా ఫొటోలకు ఫోజిచ్చారు.
ప్రపంచకప్ గ్రూప్లు
పూల్ ఏ: అర్జెంటీనా,న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్
పూల్ బీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, చైనా
పూల్ సీ: బెల్జియం, భారత్, కెనడా, దక్షిణాఫ్రికా
పూల్ డీ: హాలెండ్, జర్మనీ, మలేసియా, పాకిస్థాన్
భారత్ షెడ్యూల్..
బుధవారం సాయంత్రం 7గంటలకు దక్షిణాఫ్రికాతో..
డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు బెల్జియంతో..
డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 7 గంటలకు కెనడాతో..

షారుఖ్ చక్ దే ఇండియా
ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి హాకీ ఆట నేర్పించాడని, అలాగే తమ స్కూల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించినట్టు గుర్తుచేసుకున్నాడు. ప్రసంగం చివర్లో చక్ దే ఇండియా సినిమాలో మహిళా హాకీ జట్టును ఉత్తేజపరుస్తూ చెప్పిన డైలాగ్ను మరోసారి వినిపించాడు. చేతిలో హాకీ స్టిక్తో కెప్టెన్లతో కలిసి ఖాన్ అలరించాడు.

మాధురీ మదర్ ఎర్త్
ఆ తర్వాత 45 నిమిషాల పాటు సాగిన ఎర్త్ సాంగ్ నృత్య రూపకం హైలైట్గా నిలిచింది. ముందుగా భూమి ఆకారం పైకి లేవగా ఆ తర్వాత భూమాత రూపంలో మాధురీ దీక్షిత్ కనిపించింది. ఈ ప్రపంచాన్ని తన సంతానంగా చెబుతూ భగవద్గీత, ఉపనిషత్తులను ఉదహరిస్తూ నృత్య రూపకం సాగింది. వాతావరణ కాలుష్యంతో ప్రస్తుతం భూమి ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను మాధురీ పాట ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది.
నుపూర్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ పాటకు ఆయువుపట్టులా నిలిచిన దీక్షిత్ 800 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి చేసిన నృత్యం వేడులకు హైలెట్గా నిలిచాయి. దీనికి తోడు బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ షిమాక్ దేవార్ పర్యవేక్షణలో 1100 ఆర్టిస్టులు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది.

లాస్ట్ అండ్ ది బెస్ట్గా రెహ్మాన్ షో..
చివర్లో రెహమాన్ సంగీత భావరి ఉర్రూతలూగించింది. దిల్ సే.. హమ్మ..హమ్మా, మా తుఝే సలామ్, జయహో పాటలతో మైమరిపించాడు. ఈ కార్యక్రమ ఆరంభంలో 1975లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ఆటగాళ్లను నిర్వాహకులు పరిచయం చేశారు. ప్రపంచకప్ కోసం ప్రత్యేకంగా రూపొందిన, గుల్జార్ సాబ్ రాసిన జై హింద్ జై ఇండియా పాటతో ఆరంభ వేడుకలకు ముగింపు పడింది. రెహమాన్ సంగీత బృందం చేసిన హంగామా ప్రేక్షకులను కట్టిపడేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications