జకార్తా: ఆసియా గేమ్ష్ 2018లో పురుషుల హాకీ ఫైనల్కు చేరడంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఘోరమైన షాక్ తగిలింది. చావోరేవో అన్నట్టు సాగిన సెమీస్లో మలేషియా విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన వేళ విపరీతమైన ఒత్తిడికి భారత ఆటగాళ్లు తలొగ్గారు. షూటాఫ్ తర్వాత సడన్డెత్లో 6-7 తేడాతో ఓటమి చవిచూశారు.
ఈ ఓటమితో భారత్ 2020 ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. ఎనిమిదేళ్ల క్రితం గ్వాంఝౌలోనూ మలేషియానే టీమిండియాను ఓడించడం గమనార్హం. 60 నిమిషాల పాటు జరిగిన ఆటలో రెండు జట్లు 2-2తో సమంగా నిలవడంతో షూటాఫ్ అనివార్యమైంది. అంతకు ముందు గ్రూప్ దశలో భారత్ 76 గోల్స్ చేయడం విశేషం. హోరాహోరీగా సాగిన సెమీస్లో భారత్, మలేషియా నువ్వానేనా అన్నట్టు ఆడాయి. మైదానంలో టీమిండియా బంతిపై ఆధిపత్యం సాగించింది.
పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైంది. దీంతో అర్ధభాగం ముగిసే సరికి రెండు జట్లు 0-0తో నిలిచాయి. ఈ క్రమంలో 33వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్, 40వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేశారు. మలేషియా ఆటగాళ్లు ఫైజల్ సారీ, మహ్మద్ రజీ గోల్స్ చేయడంతో ఆట ముగిసే సరికి స్కోరు 2-2తో సమమైంది.
షూటాఫ్లోనూ రెండు జట్లు అత్యంత ఒత్తిడి మధ్య ఆడాయి. అయితే ఆటగాళ్లు చక్కగా ఆడటంతో మళ్లీ షూటప్లో స్కోర్లు 5-5తో సమం అయ్యాయి. ఆ తర్వాత జరిగిన సడన్డెత్లో రెండు జట్లు తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో స్కోరు 6-6 అయింది. మలేసియా రెండో అవకాశంలో గోల్ చేయగా భారత్ తరఫున ఎస్వీ సునీల్ ఒత్తిడిలో గోల్ చేయలేకపోయాడు. దీంతో 6-7తో టీమిండియాకు ఓటమి తప్పలేదు.