హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత అమ్మాయిలు అదరగొట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మంగళవారం నిర్వహించిన క్రాస్ ఓవర్ మ్యాచ్లో రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు 3-0 గోల్స్ తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్లో ఎక్కువ శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న భారత్.. పదే పదే ఇటలీ గోల్పోస్టుపై ఎదురు దాడులు చేసింది.
తొమ్మిదో నిమిషంలో లాల్రెమ్సియామి చేసిన గోల్ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపింది. 45వ నిమిషంలో నేహా గోయల్ బంతిని నెట్లోకి పంపి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. ఆరు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వందన కటారియా గోల్ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది.
ఈ విజయంతో భారత్ 1974 తర్వాత ప్రపంచకప్లో మరోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 1974లో జరిగిన తొలి మహిళల ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఏనాడూ లీగ్ దశను అధిగమించలేకపోయింది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత్ మహిళల హాకీ జట్టు ప్రపంచకప్లో టాప్-8లోకి ప్రవేశించడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐర్లాండ్తో భారత్ తలపడుతుంది. పూల్ 'బి'లో ఐర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0-1తో ఓడిపోయింది.