
హైదరాబాద్: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐస్ హాకీ జట్టుకు చెందిన 13 మంది ఆటగాళ్లు, ఓ డ్రైవర్ మృత్యువాత పడ్డారు. దీంతో కెనడాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కెనడాలోని సస్కచివాన్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు వెల్లడించారు.
రాయల్ కెనడా మౌంటెడ్ పోలీసుల కథనం ప్రకారం హంబోల్డ్ బ్రాంకోస్ జట్టుకు చెందిన జూనియర్ ఐస్ హాకీ ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం కలిపి 28 మంది ఓ బస్సులో వెళ్తున్నారు. సస్కచివాన్లోని టిస్డేల్లో హైవేపై వెళ్తుండగా వీరి వెళ్తున్న బస్సు అటుగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొన్నాయి.
దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది ఆటగాళ్లు, డ్రైవర్ మృచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మృతుల వివరాల గురించి ఇప్పడే చెప్పలేమని ఇంకాస్త సమయం పడుతుందని పోలీసులు వెల్లడించారు. జట్టు రోస్టర్ను పరిశీలించినట్లైతే ఆటగాళ్లంతా కూడా 16 నుంచి 21 ఏళ్ల వయసులో మధ్యలో వారుగా గుర్తించారు. జూనియర్ హాకీ లీగ్లో పాల్గొనేందుకు వెళ్తోన్న ఈ జట్టుని హంబోల్డ్ బ్రాంకోస్గా పోలీసులు పేర్కొన్నారు.
కెనడా ప్రధాని సంతాపం
ఐస్ హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇసలు ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేకపోయానంటూ ట్వీట్ చేశారు.