
హైదరాబాద్: జకార్తా వేదికగా ఆగస్టులో జరగనున్న ఆసియా గేమ్స్లో పాకిస్థాన్ హాకీ జట్టు బరిలో దిగడంపై సందిగ్ధం నెలకొంది. గత ఆరు నెలలుగా హాకీ క్రీడాకారులకు రోజువారీ భత్యాలు చెల్లించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) ఒక్కో ఆటగాడికి రూ.12 లక్షలు బకాయి పడింది. గత ఆరు నెలలుగా పీహెచ్ఎఫ్ పాకిస్థాన్ హాకీ క్రీడాకారులకు రోజువారీ భత్యాలను చెల్లించడం లేదు. ఒక్కో ఆటగాడికి చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 8లక్షలకు పైనే ఉంది.
వీరంతా ఛాంపియన్స్ టోర్నమెంట్ లాంటి అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా పాకిస్థాన్ తరుపున ప్రాతినిథ్యం వహించారు. రోజువారీ భత్యాలు చెల్లించకపోవడంపై పాక్ పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ ''మా బకాయిలు చెల్లించకపోతే ఇండోనేసియాకు వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాం. ఆగస్టు 12న మేం బయల్దేరాలి. పదో తేదీ వరకు ఎదురుచూస్తాం. మేం ఆడాలా? లేదా? అన్నది అప్పుడు నిర్ణయిస్తాం" అని తెలిపాడు.
"ప్రస్తుతం కరాచీలోని నేషనల్ క్యాంపులో ప్రాక్టీస్ చేస్తున్నాం. మా సాధన అద్భుతంగా సాగుతోంది. జట్టులోని యువ ఆటగాళ్లు సైతం ఆసియా గేమ్స్కు ఉత్సాహాంగా ఉన్నారు. మా నుంచి అద్భుతమైన ఆటను మీరు ఆశించొచ్చు" అని మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు.
కాగా, ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న ఆసియా గేమ్స్కు ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పాలెంబ్యాంగ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టు పూల్-బీలో ఉంది. పూల్ బీలో థాయిలాండ్, మలేషియా, ఓమన్, బంగ్లాదేశ్, ఆతిథ్య ఇండోషియా జట్లు కూడా ఉన్నాయి.
మరోవైపు పాక్ హాకీ జట్టుతో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గాను పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే స్పాన్సర్లతో మాట్లాడామని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అహ్మద్ తెలిపారు.
ప్రస్తుతానికి పాకిస్థాన్లో ఇంకా ప్రభుత్వ ఏర్పాటు కాలేదు. ఇటీవలే ముగిసిన పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫండ్స్ విడుదల చేసే అవకాశం ఉంది.