హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు అభిమానులకు సందడే సందడి. అంతేకాదు ఫిఫా వరల్డ్ కప్ను వీక్షించే వారిలో వయోబేధం కూడా ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పుట్బాల్పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ వీక్షిస్తుంటారు.
వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
ప్రస్తుతం జరుగుతున్న 21వ ఫిఫా వరల్డ్ కప్కు రష్యా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ క్రేజ్ ఇప్పుడు అర్జెంటీనా జైళ్లలో ఉన్న ఖైదీలను తాకింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్లను చూసేందుకు ఖైదీలు సిద్ధమయ్యారు. ప్యూర్టో మ్యాడ్రిన్ జైల్లోని కామన్ ఏరియాలో కేబుల్ టీవీ పని చేయకపోవడంతో ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు.
వరల్డ్కప్ మ్యాచ్లు వీక్షించేందుకు తక్షణం కేబుల్ టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని జైల్లోనే వారంతా డిమాండ్ చేశారు. "మూడు రోజులుగా కేబుల్ పనిచేయడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించేంతవరకు ఆహారం ముట్టకూడదని నిర్ణయించుకున్నాం" అని తొమ్మిది మంది ఖైదీలు ఓ ప్రకటనలో తెలిపారు.
అంతేకాదు ఈ విషయమై కోర్టులో కేసు కూడా వేశారు. కాగా... టోర్నీలో భాగంగా గత శనివారం అర్జెంటీనా, ఐస్ల్యాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట తొలి అర్ధభాగంలోనే ఈ రెండు గోల్స్ నమోదవడం విశేషం.
ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. గోల్ మాత్రం నమోదు కాలేదు. పెనాల్టీ రూపంలో అర్జెంటీనాకు వచ్చిన అవకాశాన్ని మెస్సీ గోల్గా మలచడంలో విఫలమయ్యాడు. దీంతో తొలిసారి ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కించుకున్న పసికూన ఐస్ల్యాండ్ జట్టు అర్జెంటీనా జట్టుకు గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. టోర్నీలో భాగంగా అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్లో క్రొయేషియాతో తలపడనుంది.