కూరగాయలు పండిస్తున్నాం:
శారీరకంగా, మానసికంగా నూతనోత్సాహం పొందడానికి వ్యవసాయాన్ని మార్గంగా ఎంచుకున్నాడట గౌర్మాంగీ సింగ్. ఈ విరామ సమయంలో ఇంఫాల్లోని తన సొంత స్థలంలో సోదరులతో కలిసి సేంద్రీయ సేద్యం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. 'ఏఐఎఫ్ఎఫ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌర్మాంగీ మాట్లాడుతూ... 'మా ఇంటి నుంచి కొద్ది దూరంలో మాకు కొద్దిగా స్థలం (ఎకరం) ఉంది. గత రెండేళ్ల నుంచి అక్కడ కొన్ని కూరగాయలు పండిస్తున్నాం. ఈ లాక్డౌన్ వల్ల సమయం లభించడంతో మరింత దృష్టి పెట్టాం' అని తెలిపాడు.
|
వ్యవసాయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా:
'మా సోదరులతో కలిసి ఈ సారి మిరప, పసుపు, అల్లం, దోసకాయ, మొక్కజొన్న, గుమ్మడి, కాకరకాయ లాంటి విభిన్న రకాల పంటలను పెంచుతున్నాం. సేంద్రీయ పద్ధతుల్లో చేస్తున్న ఈ వ్యవసాయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. తోట (గార్డెన్)లో పని చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. రోజూ కొన్ని గంటల పాటు అక్కడే గడుపుతున్నా. చాలా బాగుంది. విత్తనాలు వేయడం దగ్గర నుంచి కూరగాయలు కోయడం వరకూ.. ఇలా అన్ని పనులు చేయడం మనసుకు ప్రశాంతతను ఇస్తోంది' అని గౌర్మాంగీ సింగ్ చెప్పాడు.
స్నేహితులు వాటా అడుగుతున్నారు:
'మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అన్ని కూరగాయలు గార్డెన్నుంచి తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్లో ఈ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. మా స్నేహితులు వాటా అడుగుతున్నారు' అని మాజీ డిఫెండర్ గౌర్మాంగీ చెప్పాడు. శారీరకంగా, మానసికంగా తాజాగా ఉండటానికి ఇది మంచి మార్గం అని అభిప్రాయపడ్డాడు. లాక్డౌన్ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా వీలు కల్పిస్తుందన్నాడు. గౌర్మాంగీ.. సెకండ్ డివిజన్ లీగ్ జట్టు బెంగళూరు ఎఫ్సీకి ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన గౌర్మాంగీ భారత్ తరఫున 71 మ్యాచ్లు ఆడాడు.
ఓ గుణపాఠం నేర్పింది:
కరోనా వైరస్ ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా అందరికి ఓ గుణపాఠం నేర్పిందని, జీవిత కాలానికి సరిపోయే ఎన్నో విషయాలను తెలియజేసిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా తెలిపాడు. మహమ్మారి తనలో మానవత్వాన్ని తట్టిలేపిందని, అందుకే కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాని చెప్పాడు. కేవలం డబ్బు సంపాదించడానికే మనం బతకడం లేదని, ఇతరులకు సాయం చేయడం కూడా మన బాధ్యత అని స్పష్టం చేశాడు.