న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఫ్రాంచైసీ సహ యజమాని - బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్.. ఐఎస్ఎల్ పూర్తిస్థాయి లీగ్గా తీర్చిదిద్దడమే నీతా అంబానీ కల అని చెప్పాడు. ప్రస్తుత ఫార్మాట్ను ఏడాది పొడవునా సాగే విధంగా మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉన్నదని పేర్కొన్నాడు.
దీర్ఘ కాలం లీగ్ను కొనసాగించేందుకు ఆయా జట్లకు కీలకమైన కెప్టెన్లను కోల్పోకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. తమ ఫ్రాంచైసీ జట్టు చెన్నై ప్లేయర్లు గానీ, కోచ్ మార్కో మాట్టరాజీ గానీ తమ చాంపియన్షిప్ను నిలబెట్టుకోవడం తప్ప మరో అంశాన్ని ఆలోచించడం లేదన్నాడు.
డియాగో ఫోర్లాన్, జాన్ ఆర్నె రైస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైసీలతో ఒప్పందం చేసుకోవడమే సమస్యగా ఉందా? అన్న ప్రశ్నపై అభిషేక్ స్పందిస్తూ 'నేను డియాగో ఫోర్లాన్ కోసం మాట్లాడలేదు. ఆయన ఐఎస్ఎల్లో ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆయన వంటి ఆటగాళ్లు ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఐఎస్ఎల్కు మంచి పేరు వస్తుంది' అని అన్నాడు.
రైస్ గురించి స్పందిస్తూ తమ ఫ్రాంచైసీ కెప్టెన్ అని గుర్తుచేశాడు. రైస్ ఆటను, సహచర ప్లేయర్లను ప్రేమిస్తాడని తెలిపాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా వారు హ్యాపీగానే ఉంటారని చెప్పాడు. కనుక వారిని కెప్టెన్లుగా నియమించుకోవడం వల్ల లీగ్ను సుదీర్ఘ కాలం నడిపేందుకు కష్టమేమీ కాదన్నాడు.
లీగ్ను సుదీర్ఘంగా నడిపేందుకు తమ మధ్య ప్రాథమిక స్థాయిలో మాత్రమే చర్చలు జరిగాయన్నాడు. ప్రస్తుతం చెన్నైయిన్ జట్టు కోచ్ మాట్టరాజీతో సహా అందరి దృష్టి కూడా చాంపియన్షిప్ను కొనసాగించడంపైనే ఉండడం దీనికి కారణమన్నాడు.
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్), ఐ - లీగ్ల వైఖరితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడను ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి సారించాలని వ్యాఖ్యానించాడు.
'బోర్డుతోపాటు ప్లేయర్లు, ఆయా ఫ్రాంచైసీల యాజమాన్యాలు, స్పాన్సరర్లు, ఆర్థిక దన్ను గల టీం ఓనర్లు అన్ని వర్గాలు, రంగాలు లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికంటే ముఖ్యమైంది దేశంలో ఫుట్బాల్ క్రీడ అభివృద్ధి చేయడం. మేం ఏడాది పొడవునా లీగ్ నిర్వహించాలని భావిస్తున్నాం. అయితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి ఎల్లవేళలా వచ్చేవే. కానీ ఎల్లప్పుడూ ఐఎస్ఎల్, నీతా అంబానీ కల కేవలం పూర్తిస్థాయిలో ఏడాది పొడవునా లీగ్ నిర్వహించడమే' అని చెప్పాడు.
ఆనందంలో డౌటీ
కేరళ బ్లాక్బస్టర్స్తో అతి కష్టంగా విజయం సాధించడంతో అట్లెటిక్ డీ కోల్కతా ప్లేయర్ సమీగ్ డౌటీ పూర్తిగా సంతోషంలో మునిగిపోయాడు. కష్టమైనా తాము చాలా మంచి ఆట ఆడామన్నాడు. జట్టు సభ్యులంతా సమిష్టిగా బాధ్యతాయుతంగా ఆడటం వల్లే విజయం సాధించామని తెలిపాడు. మ్యాచ్ను గెలుచుకుని మూడు పాయింట్లు పొందడంపైనే తమ దృష్టంతా ఉందన్నాడు.
ఫైనల్స్కెళ్లడమే లక్ష్యమన్న ఢిల్లీ ప్లేయర్ రిచర్డ్గార్గే
ఐఎస్ఎల్ మూడో ఎడిషన్ టోర్నీలో ఫైనల్స్ వరకూ దూసుకెళ్లడమే తమ లక్ష్యమని ఢిల్లీ డైనమోస్ ఫార్వర్డ్ రిచర్డ్గార్గే పేర్కొన్నాడు. గురువారం సాయంత్రం చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్తో తొలి లీగ్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో గార్గే ఓ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇస్తూ మూడో ఎడిషన్ ఐఎస్ఎల్లోనూ కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. గత ఏడాది జాన్ ఆర్నే రైస్, హాన్స్ మల్డర్లు ఢిల్లీ ఫ్రాంచైసీలో ఉన్నారని, ఈ దఫా తాము వారిద్దరిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. వారి బలం, బలహీనతలు తమకు తెలుసునన్నాడు గార్గే.