

హైదరాబాద్: ప్రపంచంలో అతి పెద్ద క్రీడా మహోత్సవానికి తెర లేచింది. రష్యా ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ 21వ ఫిఫా వరల్డ్కప్ ఆరంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. రష్యా రాజధాని మాస్కోలని లుజ్నికి స్టేడియంలో స్పేష్ షిఫ్తో ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి.
అనంతరం బ్రెజిల్ పుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ మస్కట్ వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. బ్రిటిష్ పాప్స్టార్ రాబీ విలియమ్స్ తన ఆట పాటలతో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో రాబీతో పాటు రష్యన్ స్పొరానో ఐదా గారిఫుల్లీనా కూడా పాటులు పాడింది. బ్రెజిలియన్ గ్రేట్ రోనాల్డో, విల్ స్మిత్, నిక్కీ జామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రష్యా దేశ చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు, కళాకారుల పాటలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా అదరహో అనిపించాయి. దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అతిరథ మహారథులు, అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. లుజ్నికి స్టేడియంలో పాటలు, నృత్యాలతో అభిమానులను అలరించారు.
మరోవైపు దీనికి సమాంతరంగా మాస్కో నగరంలోని ప్రఖ్యాత రెడ్ స్క్వేర్లో నిర్వహించిన సంగీత విభావరి అభిమానులను ఆకట్టుకుంటుంది. 80 వేల ప్రేక్షక సామర్థ్యమున్న లుజ్నికి స్టేడియంలో దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్లు, ట్రాంపోలినిస్ట్లు ఈ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు.
ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభోపన్యాసం చేయగా... ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఫీఫా ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరంభవేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది.
టోర్నీలో అత్యంత తక్కువ ర్యాంకు (70వ) జట్టు రష్యానే. గత 15 మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం మూడు మాత్రమే నెగ్గింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న సౌదీ అరేబియాపై ఎటువంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ సారి ప్రపంచకప్లో ఐస్లాండ్, పనామా దేశాలు అరంగేట్రం చేయనున్నాయి. బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు కప్ను గెలిచింది. ఫిఫా టైటిల్ విజేతగా నిలిచే జట్టుకు రూ.258 కోట్ల ప్రైజ్మనీ లభించనుంది.
ఈ వరల్డ్ కప్లో మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్-ఎలో బరిలో నిలిచింది. వరల్డ్ కప్ కోసం మొత్తం 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 28వ వరకు గ్రూప్ దశ పోటీలు ఉంటాయి.

ఎనిమిది గ్రూప్ల్లోని నాలుగేసి జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్లో టాప్-2 జట్లు నాకౌట్కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది.